తలమానికంగా మినీ ట్యాంక్బండ్
రూ.2.50 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం
సకల వసతులతో వైకుంఠధామం
ప్రభుత్వ లక్ష్యాలు పూర్తి
చుంచుపల్లి, మార్చి 26:ఆ పల్లె ఆహ్లాదానికి చిరునామాగా మారింది.. అభివృద్ధికి తలమానికంగా నిలిచింది. స్వచ్ఛత దిశగా అడుగులు వేస్తున్నది. జిల్లాకేంద్రానికి సమీపంలో ఉన్న విద్యానగర్కాలనీ పంచాయతీ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. పాలకవర్గ సభ్యులు గ్రామాభివృద్ధికి పక్కా ప్రణాళికలు రూపొందించారు. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకొని ‘ప్రగతి’ సాధించి ఇతర గ్రామాలకూ ఆదర్శంగా నిలిపారు. వైకుంఠధామంతో ఆఖరి మజిలీ కష్టాలు తీరాయి. మినీట్యాంక్ బండ్, పార్కు, చెరువులో బోటింగ్ సౌకర్యం త్వరలో అందుబాటులోకిరానున్నది.
సీఎం కేసీఆర్ నిర్దేశించిన పల్లె ప్రగతి లక్ష్యాలను చేరుకున్నది జిల్లాకేంద్రానికి సమీపంలో ఉన్న విద్యానగర్కాలనీ పంచాయతీ. పాలకవర్గ సభ్యులు పక్కా ప్రణాళికలు రూపొందించారు. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకున్నారు. ‘ప్రగతి’ సాధించి పంచాయతీని ఇతర గ్రామాలకూ ఆదర్శంగా నిలిపారు. కాలనీలో 4,878 వేల కుటుంబాలు నివసిస్తూ ఉండగా 10,546 జనాభా ఉంది. సర్పంచ్ గోవింద్, పంచాయతీ కార్యదర్శి రియాజుద్దీన్ మొదటి, రెండో విడత పల్లె ప్రగతి పనులన్నీ పూర్తి చేశారు. రూ.12.50 లక్షలతో వైకుంఠధామం, రూ.5 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.2.50 లక్షలతో డంపింగ్ యార్డు నిర్మించారు. కాలనీలో పాతబడిన నాలుగు భవనాలను కూల్చి వేయించారు. కంపచెట్లను తొలగింపజేశారు. నాలుగువేల విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ దీపాలు బిగించారు. కొత్తగా మరో 40 స్తంభాలు వేసేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 400 మొక్కలు, రహదారి మధ్య ఉన్న డివైడర్ల మధ్య 800 మొక్కలు నాటారు. కాలనీలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.ఏర్పాటు చేసిన మినీట్యాంక్బండ్ కాలనీకే తలమానికంగా నిలుస్తున్నది. దీనిపై ప్రత్యేకంగా వాకింగ్ట్రాక్ ఏర్పాటైంది. ఇక్కడ పిల్లలు ఆడుకునేందుకు పార్క్, అట వస్తువులు, పర్యాటక అభివృద్ధికి చెరువులో బోటింగ్ సౌకర్యం అందుబాటులోకి రానున్నది. త్వరలో చేపల పెంపకం కూడా చేపట్టనున్నారు. రాంనగర్లో మిషన్ భగీరథ ట్యాంకు వద్ద ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం కాలనీవాసులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. ఉదయం, సాయంత్రం చిన్నారులు ప్రకృతి వనానికి వెళ్లి ఆహ్లాదంగా గడుపుతున్నారు. నిత్యం ఇద్దరు కూలీలు అందుబాటులో ఉండి వనంలోని మొక్కలను సంరక్షిస్తున్నారు. కాలనీలో రూ.2.50 కోట్లతో 65 సీసీ రోడ్లు ఏర్పాటయ్యాయి. వీధుల్లో విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లు రాత్రిళ్లు వెలుగులు పంచుతున్నాయి.