భూసర్వేకు రూ.1.50 లక్షలు డిమాండ్చేసిన డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్
ఏసీబీని ఆశ్రయించిన బాధిత రైతు
రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన సర్వేయర్
వేంసూరు, మార్చి 24: భూమి ఆక్రమణకు గురవుతున్నదని, వెంటనే భూసర్వే చేయాలని కోరిన రైతును రూ.2 లక్షలు లంచం అడిగారు డిప్యూటీ తహసీల్దారు, సర్వేయర్. అంత డబ్బు ఇచ్చుకోలేనని రైతు మొరపెట్టుకున్నా వారి గుండె కరగలేదు. చివరికి రూ.1.50 లక్షలు ఇస్తే గానీ పని జరగదన్నారు. సర్వేకు ముందే రూ.లక్ష ఇవ్వాలని, పూర్తయిన తర్వాత రూ.50 వేలు ఇవ్వాలనే షరతు పెట్టారు. ఇక ఏం చేయాలో అర్థం కాని రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించి అవినీతి అధికారుల ఆట కట్టించాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వేంసూరు రెవెన్యూ పరిధిలోని తోట సాంబశివరావు, అతని కుటుంబ సభ్యులకు చెందిన సుమారు 25 ఎకరాల భూమి సరిహద్దు విషయంలో సరిహద్దు భూమి యజమానులతో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో బాధితుడు వేంసూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, సమస్యను తహసీల్దార్ కార్యాలయంలోనే పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో భూసర్వే చేయాలని బాధితుడు డిప్యూటీ తహసీల్దార్ ఉపేందర్, సర్వేయర్ గురవేశ్ను కోరారు. అందుకు డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్ రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు రూ.1.50 లక్షలకు బేరం కుదుర్చుకుని రూ.లక్ష ముందుగా అందజేయాలని కోరారు. డబ్బు చెల్లించలేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
పక్కా ప్రణాళికతో.. రెడ్హ్యాండెడ్గా..
ఏసీబీ అధికారుల సూచనల మేరకు బుధవారం రైతు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. సర్వేయర్ వద్దకు వెళ్లి డబ్బు తెచ్చానని చెప్పాడు. కారు డాష్బోర్డులో రూ.లక్ష పెట్టాలని సర్వేయర్ చెప్పగా రైతు కారు వద్దకు వెళ్లాడు. సర్వేయర్ కూడా రైతు వెనుకే వస్తున్నాడు. ఈ క్రమంలో రైతు కారులో పెడుతుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. దాడుల్లో పట్టుబడిన సర్వేయర్, డిప్యూటీ తహసీల్దార్ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దాడిచేసిన వారిలో ఏసీబీ డీఎస్పీ మధుసూదన్రావు, ఖమ్మం ఇన్స్పెక్టర్ రమణమూర్తి, వరంగల్ ఇన్స్పెక్టర్ సతీశ్క్రాంతి తదితరులు ఉన్నారు. కాగా ఏసీబీ దాడులు జరిగి డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్ గురవేశ్ పట్టుబడ్డారని తెలుసుకున్న కొందరు రైతులు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి పటాకులు కాల్చారు. గతంలోనూ ఇదే కార్యాలయంలో ఓ అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడని, అయినా అధికారులు, సిబ్బందిలో ఎలాంటి మార్పు లేదని వారు వెల్లడించారు. రెవెన్యూ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ఇప్పటికే అనేకసార్లు ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశామన్నారు.