ఆహ్లాదకరంగా పల్లె వనం
రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్
అందుబాటులోకి డంపింగ్ యార్డు, వైకుంఠధామం
ప్రభుత్వ నిధులు సద్వినియోగం
జూలూరుపాడు, మార్చి 21: పడమట నర్సాపురం.. ‘ప్రగతి’ నర్సాపురంగా మారుతున్నది.. పాలకవర్గం ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ పంచాయతీని అభివృద్ధి మార్గం పట్టించింది.. అన్ని సౌకర్యాలతో వైకుంఠధామాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.. పారిశుధ్య నిర్వహణకు డంపింగ్ యార్డు ఏర్పాటు చేసింది.. వీధివీధికీ సీసీ రోడ్లు నిర్మించింది.. వీధి దీపాలకు ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసింది.. పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటించి ఊరికే కొత్తకళ తెచ్చింది.. మరి ఈ పంచాయతీలో ‘ప్రగతి’ ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..!
పడమట నర్సాపురం.. ప్రగతి నర్సాపురంగా మారుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం అమలుతో ఆ గ్రామ రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రతి నెలా రూ.3.24 లక్షల నిధులు వస్తుండడంతో విరివిగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వీధులు పరిశుభ్రంగా ఉండడం, సీసీ రోడ్లు అద్దంలా మెరుస్తుండడం, ఎల్ఈడీ బల్బులతో వీధి లైట్లు వెలుగులు విరజిమ్ముతుండడంతో గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రోడ్లకు ఇరువైపులా పెరుగుతున్న మొక్కలు, పల్లె ప్రకృతి వనంలో పూల మొక్కలు గ్రామస్తులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. డంపింగ్ యార్డు, వైకుంఠధామం అందుబాటులోకి రావడంతో ఏళ్లనాటి సమస్యలకు పరిష్కామై మౌలిక సదుపాయాలు లభించినట్లయింది. అందుకే.. పడమట నర్సాపురం ప్రగతి నర్సాపురంగా వెలిగిపోతోంది.
అభివృద్ధిలో పరుగులు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న పడమటనర్సాపురం గ్రామం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. గ్రామ సమీపంలోని సర్వే నెంబర్ 119లో ప్రభుత్వ భూమి ఉండడం అక్కడే రైతువేదికను నిర్మించారు. ప్రకృతివనాన్ని ఏర్పాటు చేశారు. సమీపంలోనే సమ్మక్క సారలమ్మలు కొలవై ఉండడంతో ఆ ప్రాంతం మొత్తం పచ్చదనంతో కళకళలాడుతోంది. ప్రధాన రహదారిపై ప్రయాణించే ప్రతిఒక్కరూ ఆహ్లాదభరితమైన ఈ వాతావరణాన్ని ఆస్వాదించేలా అభివృద్ధి జరుగుతోంది. పవర్ గ్రిడ్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల, పోస్టు మెట్రిక్ గిరిజన బాలికల కళాశాల వసతి గృహం, 80 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం వంటివి అక్కడే ఉండడంతో గ్రామంలో అభివృద్ధిలో దూసుకెళ్తోంది.
వచ్చిన నిధులు
గ్రామంలో మొత్తం 3,500 జనాభా ఉండగా 2010 మంది ఓటర్లు ఉన్నారు. 10 వార్డులు ఉన్న ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఎంతో అభివృద్ధి జరిగింది. వైకుంఠధామ నిర్మాణానికి రూ.10 లక్షలు, పల్లె ప్రకృతివనానికి రూ.2.50 లక్షలు, డంపింగ్ యార్డుకు రూ.2.60 లక్షలు, రైతు వేదికకురూ.22 లక్షలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు 170, స్తంభాలకు అమర్చిన ఎల్ఈడీ బల్పులు 170, సీసీ రోడ్లుగా 14 వీధులు మారాయి. గ్రామంలో 10 వేల మొక్కలు నాటారు. ప్రతి నెల పంచాయతీకి రూ.3.24 లక్షల నిధులు వస్తున్నాయి. 260 మంది ఫించనుదారులు ఉన్నారు. 350 మందికి రైతుబంధు వస్తున్నది.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
‘గ్రామాన్ని అన్ని విధాలా ఆదర్శంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే గామస్తుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాం. గ్రామంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ట్రాక్టర్ కొనుగోలు చేసి ప్రతిరోజూ గ్రామంలో తడి చెత్త, పొడి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం. మధ్యాహ్నం నుంచి అదే ట్రాక్టర్తో చెట్లకు నీళ్లుపోస్తున్నాం. పల్లె ప్రగతి ప్రణాళిక రూపొందించి నిధులు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.’
-కట్రం మోహన్రావు , సర్పంచ్