ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, జనవరి 21: ‘అమ్మా.. ఆరోగ్యం ఎలా ఉంది? బాబాయ్ బాగున్నావా? దగ్గు, జలుబు ఏమైనా ఉన్నాయా? పిల్లలకు ఏమైనా సుస్తీ చేసిందా?’ అంటూ ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అడిగి తెలుసుకుంటున్నారు. కరోనా కట్టడి కోసం, బాధితుల నిర్ధారణ కోసం వైద్య ఆరోగ్య శాఖ ఇంటింటి సర్వేను చేపట్టింది. దీంతో వైద్య సిబ్బంది బృందాలుగా ఏర్పడి గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. తొలిరోజు శుక్రవారం భద్రాద్రి జిల్లాలో 969 బృందాలు 44,969 ఇళ్లను జల్లెడ పట్టి 2,854 మంది జ్వర పీడితులను గుర్తించాయి. ఖమ్మం జిల్లాలో 1,554 టీంలు 59,877 ఇళ్లను సందర్శించి 2,159 మంది జ్వర పీడితులను గుర్తించాయి. జ్వరం, వైరస్ లక్షణాలు ఉంటే వెంటనే కరోనా కిట్లు అందించి పలు సూచనలు చేస్తున్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్ పర్యవేక్షణలో జిల్లా వైద్యారోగ్యశాఖ రంగంలోకి దిగింది.
జిల్లాలో జల్లెడ పడుతున్న వైద్యశాఖ..
వైరస్ కట్టడి కోసం వైద్యారోగ్యశాఖ జిల్లాను జల్లెడ పడుతోంది. బృందంలోని ఇద్దరు సిబ్బంది ఉదయం నుంచే ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జ్వరం, దగ్గు, జలుబు, ఇతర లక్షణాలు ఉన్న వారికి మందులు అందజేస్తున్నారు. జ్వర తీవ్రతను బట్టి అవసరమైతే ఆసుపత్రికి పంపించే చర్యలకు శ్రీకారం చుట్టారు.
ముమ్మరంగా వ్యాక్సినేషన్..
మరోవైపు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. మొదటి డోస్ ఇప్పటికే వందశాతం పూర్తయింది. రెండో డోస్తోపాటు టీనేజర్ల టీకా, ప్రికాషన్ డోస్లు వేస్తున్నారు. టీనేజర్ల టీకాల్లో 52,318 మందికి గాను 47,346 మందికి, రెండో డోస్లో 1,38,232 మందికి గాను 1,33,109 మందికి, ప్రికాషన్ డోస్లో 44,118 మందికి గాను 13,148 మందికి టీకాలు వేశారు.
ఒక్కరోజే 315 మందికి పాజిటివ్..
వైరస్ వ్యాప్తి చెందుతున్నందున పరీక్షలను కూడా పెంచారు. దీంతో జిల్లాలో శుక్రవారం 5,832 మందికి పరీక్షలు చేయగా 315 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
సర్వేకు సహకరించాలి: భద్రాద్రి కలెక్టర్
కొవిడ్ నియంత్రణ కోసం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేకు ప్రజలు సహకరించాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ కోరారు. శుక్రవారం నుంచి ఇంటింటికీ సర్వే బృందాలు వస్తాయని అన్నారు. తమ ఇంట్లో ఎవరైనా దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతుంటే ఆ వివరాలను సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. లక్షణాలున్న వ్యక్తులకు సర్వే సిబ్బంది హోం ఐసొలేషన్ కిట్లు ఇస్తారని, నిరంతరం పర్యవేక్షిస్తారని అన్నారు. 5 రోజుల వరకు లక్షణాలు తగ్గకపోతే తక్షణమే సమీపంలోని ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందాలని సూచించారు. ఫ్రంట్లైన్ వారియర్లు తప్పనిసరిగా బూస్టర్డోస్ వేసుకోవాలని కోరారు. ఇంటింటి సర్వేను 4 రోజుల్లో పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కరోనా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని అన్నారు. సర్వే తీరును వైద్యాధికారులు, మండల ప్రత్యేక అధికారులు తనిఖీ చేయాలని సూచించారు. గతంలో నిర్వహించిన సర్వేతో వ్యాధి నియంత్రణ బాగా జరిగినందున ఇప్పుడు కూడా అదే తరహాలో ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.