బంజారాహిల్స్ : ఫోర్జరీ పత్రాలతో నగరం నడిబొడ్డున రూ.220 కోట్ల విలువైన ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేం దుకు ప్రయత్నించిన వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్పేట మండల పరిధిలోని సర్వే నెంబర్ 403/పిలో టీఎస్ నెంబర్ 1లోని బ్లాక్ హెచ్, వార్డు 10లో సుమారు 20 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది.
సుమారు నాలుగేళ్ల క్రితమే ఈ స్థలం చుట్టూ రెవెన్యూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కాగా ఈ స్థలంలో సుమారు రెండున్నర ఎకరాల స్థలంపై కన్నేసిన కృష్ణా గ్రూపుకు చెందిన పార్థసారధి అనే వ్యక్తితో పాటు మరికొంతమంది ప్రణాళిక రూపొందించారు. టీఎస్ఎల్ రికార్డులను ఫోర్జరీ చేసి నూకల రాఘవరావు అనే వ్యక్తికి చెందిందంటూ పత్రాలు సృష్టించారు.
ఈ పత్రాలను అడ్డుపెట్టుకుని రాఘవరావు వద్దనుంచి తాము స్థలాన్ని కొన్నట్లు డాక్యుమెంట్లను సృష్టించారు. రెండున్నర ఎకరాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఓ గదిని నిర్మించారు. స్థలం మొత్తం తమ ఆధీనంలోనే ఉందని, ఎలాంటి వివాదం లేదంటూ సత్తిరెడ్డి అనే వ్యక్తికి ఈ స్థలాన్ని అమ్ముతామని బేరం పెట్టారు.
స్థలానికి చెందిన డాక్యుమెంట్లు కూడా ఇచ్చారు. ఈ నెల 23న సత్తిరెడ్డిని తీసుకువచ్చి స్థలాన్ని చూపించారు. కాగా స్థలంపై ఏవైనా కేసులున్నాయా అనే విషయాన్ని గురించి తెలుసుకోవాలని భావించిన సత్తిరెడ్డి అదే రోజు మధ్యాహ్నం షేక్పేట మండల తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి వద్దకు వెళ్లాడు. దాంతో అసలు విషయం బయటపడింది.
తాసీల్దార్ ఆదేశాలతో సత్తిరెడ్డి చెప్పిన స్థలంవద్దకు వెళ్లిన రెవెన్యూ సిబ్బంది ఆ స్థలం ప్రభుత్వస్థలమే అని నిర్ధారించు కోవడంతో పాటు అక్రమంగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను, గదిని కూల్చేసి స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు ప్రభుత్వ స్థలాన్ని ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఆక్రమించేందుకు యత్నించిన కృష్ణా గ్రూపుకు పార్థసారథి అనే వ్యక్తితో పాటు మిగిలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ షేక్పేట మండల డిప్యుటీ తహసీల్దార్ (ల్యాండ్ ప్రొటెక్షన్) సందీప్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేపట్టిన అనంతరం నిందితులపై ఐపీసీ 447,427,468,471 సెక్షన్ల కిదం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.