ఎర్రవల్లి చౌరస్తా, జనవరి 16 : కోడిపందాల స్థావరాలపై టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేసి పెద్ద మొత్తంలో నగదు, బైకులు, కోళ్లు స్వాధీనం చేసుకున్న ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం సాసనూలు శివారులో చోటు చేసుకున్నది. టాస్క్ఫోర్స్ అధికారుల కథనం మేరకు.. సాసనూలు గ్రామ శివారు పెద్దవీరన్న గట్టు సమీపంలో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయన్న సమాచారం మేరకు ఎస్బీ సీఐ చంద్రశేఖర్, టాస్క్ఫోర్స్ ఎస్సై నరేశ్, కోదండాపూర్ ఎస్సై వెంకటస్వామి ఆధ్వర్యంలో 60 మంది పోలీసులు స్థావరాలపై దాడులు చేశారు. కోడి పందాలు ఆడుతున్న 20 మందిని అదుపులోకి తీసుకోవడంతోపాటు 100 ద్విచక్ర వాహనాలు, రూ.87,500 నగదు, 16 పందెం కోళ్లు, 19 పందెం కత్తులు స్వాధీనం చేసుకున్నారు. కోడిపందాల్లో మొత్తం 2 వేల మంది వరకు పాల్గొన్నారని ఎస్సై వెంకటస్వామి తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.