అన్నదాతలకు అన్నివిధాలా అండగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సరిపడా విత్తనాలు, ఎరువులు మొదలు నిరంతర విద్యుత్, పెట్టుబడికి సాయం అందిస్తూనే రైతుబీమాతో ధీమాగా ఉండేలా వారిలో ఆత్మైస్థెర్యాన్ని కలిగిస్తున్నారు. రైతు మరణిస్తే అతడి కుటుంబానికీ రూ.5 లక్షల బీమా పరిహారం అందుతున్నది. రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తున్నది. ఏ కారణంతో మరణించినా పరిహారం రావడంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా ఉంటున్నాయి. ఇప్పటివరకూ ఖమ్మం జిల్లాలో 2,564 మంది రైతుల కుటుంబాలకు పరిహారాన్ని అందించారు.
ఖమ్మం, జనవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ అంటే రైతుబంధువే కాదు.. వారి ఆత్మీయ బం ధువు కూడా. అందుకే రాష్ట్ర పథకాల్లో సింహభాగం అన్నదాతల సంక్షేమం కోసం ఉద్దేశించినవే ఉంటాయి. రైతులు పంటలు సాగు చేసుకోవడానికి, వాటిని విక్రయించుకోవడానికి సీఎం కేసీఆర్ ఎన్ని విధాలుగా భరోసాగా ఉంటున్నారో.. ప్రమాదవశాత్తు అదే రైతు మరణిస్తే అతడి కుటుంబానికీ అంతే అండదండగా నిలుస్తున్నారు. అందుకోసమే రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. వారి సామూహిక బీమాకు రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తోంది. రైతు ఏ కారణంతో మరణించినా అతడి కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందిస్తోంది. ఇప్పటి వరకూ ఖమ్మం జిల్లాలో 2,564 రైతు కుటుంబాలకు పరిహారాన్ని అందించారు.
రైతు కుటుంబానికి పెద్ద దిక్కు..
రైతుబీమా పథకంతో అన్నదాతల కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్నారు సీఎం కేసీఆర్. పథకం ప్రవేశపెట్టిన నాటినుంచి ఇప్పటి వరకూ ఖమ్మం జిల్లాలో 2,564 మంది రైతు కుటుంబాలకు రూ.128.20 కోట్ల బీమా పరిహారాన్ని అందించారు. అన్నం పెట్టే అన్నదాతల కుటుంబానికి అండగా ఉంటున్న ఈ పథకం దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. పెద్ద దిక్కును కోల్పోయిన కర్షకుల కుటుంబాలు వీధిన పడకుండా ఎంతో మేలు చేసింది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)తో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం ఏటా ఒక్కో రైతు తరఫున రూ.3,484 ప్రీమియాన్ని చెల్లిస్తోంది. జిల్లాలో 3,16,422 మంది పట్టాదారు పాస్బుక్ ఉన్న రైతులుండగా వారిలో రైతుబీమా పథకానికి (18 నుంచి 59 ఏళ్ల వయసున్న వాళ్లు) 1.95 లక్షల మంది అర్హులు. వీరందరి తరఫునా టీఆర్ఎస్ ప్రభుత్వం సామూహిక బీమాకు ప్రీమియం చెల్లిస్తోంది. 2018 ఆగస్టు 14 న ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2,719 మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందారు. వీరిలో ఇప్పటి వరకూ 2,564 మంది రైతు కుటుంబాలకు బీమా పరిహారం అందింది. రైతు మరణించాక ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.128.20 కోట్లు నామినీల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి.
రోజుల వ్యవధిలోనే పరిహారం..
పట్టాదారు పాస్బుక్, అర్హత ఉన్న రైతులు, నామినీల వివరాలను వ్యవసాయ అధికారులు ముందస్తుగానే సేకరించి జీవిత బీమా సంస్థకు అందజేస్తున్నారు. రైతు మరణించినట్లు సమాచారం తెలుసుకున్న మరుక్షణమే సంబంధిత ఏఈఓ.. సదరు రైతు ఇంటికి చేరుకొని అవసరమైన పూర్తి వివరాలను, మరణ ధృవీకరణ పత్రాన్ని ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. వ్యవసాయశాఖ జిల్లా కార్యాలయంలో ఉన్న నోడల్ అధికారులు ఆ వివరాలను పరిశీలించి ఎల్ఐసీకి పంపుతున్నారు. వాటిని పరిశీలించిన జీవిత బీమా సంస్థ నామినీ ఖాతాల్లో రూ.5 లక్షలు జమ చేస్తోంది.
పథకం పర్యవేక్షణకు మూడంచెల విధానం
రైతుబీమా పథకం పకడ్బందీగా అమలు చేసేందుకు మూడంచెల విధానం ఉంది. గ్రామస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారి, మండల స్థాయిలో మండల వ్యవసాయశాఖ అధికారి, జిల్లా కార్యాలయంలో ప్రత్యేక నోడల్ అధికారి ఉన్నారు. రైతు ఏ కారణంతో చనిపోయినా ఏఈవోలు ఆ వివరాలను సేకరించి ఆన్లైన్ చేస్తారు. అనంతరం దశల వారీగా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. పది రోజుల్లోపే రైతుల నామినీ బ్యాంకు ఖాతాల్లో రూ.5 లక్షల పరిహారం జమ అవుతుంది.
-విజయనిర్మల, డీఏవో, ఖమ్మం
పరిహారం పొందిన కుటుంబాలు
సంవత్సరం చనిపోయిన పరిహారం పొందిన
రైతులు కుటుంబాలు
2018-19 815 810
2019-20 839 834
2020-21 708 702
2021-22 357 218
మొత్తం 2,719 2,564