రఘునాథపాలెం, జనవరి 17: ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి విముక్తి కల్పించేందుకు తెలంగాణ సర్కారు ముందుకు సాగుతోంది. పెరుగుతున్న కేసులను తగ్గించడంలో విశేష కృషి చేస్తున్నది. వ్యాక్సిన్తోనే కరోనా వ్యాప్తిని కట్టడి చేయవచ్చుననే ఉద్దేశంతో ఊరూరా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. ఇప్పటికే మొదటి డోసు 100 శాతం పూర్తి చేసిన వైద్యులు.. సెకండ్ డోసు సైతం వంద శాతానికి చేరువ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అంతేగాక 15 18 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సిన్ను విజయవంతంగా అందిస్తూనే.. 60 ఏళ్ల పైబడిన వారికి, ఫ్రంట్లైన్ వారియర్లుగా ఉన్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బందికి బూస్టర్ డోసును అందజేస్తున్నారు. ఇందుకు కోసం వైద్య సిబ్బంది నిత్యం పల్లెల్లో అందుబాటులో ఉంటూ కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. వైద్య సిబ్బందితోపాటు గ్రామాల్లో రెవెన్యూ, పంచాయతీ రాజ్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పిస్తూ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం పనిచేస్తున్నారు.