అంబర్పేట : ఎవరో నిర్లక్ష్యం చేయడం వల్ల చేయని తప్పుకు దురదృష్టవశాత్తు ఎయిడ్స్ వ్యాధి సంక్రమించడం చాలా బాధాకరమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గోల్నాక డివిజన్, అన్నపూర్ణనగర్లో బేతల్ గాస్పెల్ చర్చి ఆధ్వర్యంలో గో-ఇండియా సంస్థ సహకారంతో కె.సుధాకర్ అధ్యక్షతన 500 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరై వారికి మందులు, నిత్యావసర సరుకులు, బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో వైద్య రంగం చాలా అభివృద్ధి చెందిందని, వ్యాధిగ్రస్తులంతా మనో నిబ్బరంతో ఉండాలని ధైర్యం చెప్పారు. వారందరికీ సమయానికి మందులు, కౌన్సెలింగ్ అందిస్తూ అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తున్న సుధాకర్కు అభినందనలు తెలియజేశారు.
ఒకప్పటిలా వ్యాధిగ్రస్తులను సమాజంలో చిన్నచూపు చూసే పరిస్థితి లేదని, వీరికి ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు వీలైనంత మేరకు సమాజంలోని అందరూ సహాయం చేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా అంబర్పేట పీఎస్ సీఐ శ్రీధర్, గో-ఇండియా సంస్థ డైరెక్టర్ కిరణ్పాల్, మేరీట్రిసెళ్ల, చర్చి సిబ్బంది గో-ఇండియా సంస్థ సిబ్బంది, ఏరియా పాస్టర్, బెతెల్ గాస్పెల్ చర్చి వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.