అమీర్పేట్, ఏప్రిల్ 24 : జర్నలిస్టుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో బేగంపేట్లోని హోటల్ హరిత ప్లాజాలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న మహిళా జర్నలిస్టుల సదస్సు ఆదివారం ముగిసింది. చివరి రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత మహిళా జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడారు. చాలెంజింగ్గా ఉండే జర్నలిస్టు వృత్తిని సమర్థవంతంగా నిర్వహిస్తున్న మహిళలను అభినందించారు.
తెలంగాణ సచివాలయ నూతన భవనంలో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేకంగా గదులు ఉండేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. వార్తా సంస్థల నిర్వహణలో పాశ్చాత్య దేశాల్లో అవలంబించే విధానాలను అందిపుచ్చుకోవడం వల్ల మహిళలకు జర్నలిస్టులుగా అవకాశాలు అందివచ్చాయన్నారు. అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ముందుకుపోతున్న మహిళా జర్నలిస్టులను ప్రత్యేకంగా అభినందించారు.
ఏ రంగంలో అయినా మహిళలు ఇబ్బందులు పడుతున్న విషయం సాధారణమే అయినా.. ఎక్కడా మహిళలు కుంగిపోకుండా తమను తాము నిరూపించుకుంటూ పురుషులకు దీటుగా ముందడుగు వేస్తున్న తీరు స్ఫూర్తిదాయకమన్నారు. వర్క్ప్లేస్లో వేధింపుల కట్టడికి అన్ని సంస్థల్లో మహిళల నేతృత్వంలో ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదన్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో 18 వేల మంది జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డులు కలిగి ఉన్నారన్నారు. రూ.100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కార్ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి కష్ట సమయాల్లో ముందుండి ఆదుకుంటున్నదని చెప్పారు.
కొవిడ్ వ్యాప్తి సమయంలో మృతి చెందిన 64 మంది జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున సాయం అందించి ఆదుకున్నామని వివరించారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఏర్పాటు చేసిన నిధి నుంచి ఇప్పటి వరకు రూ. 42 కోట్లు వెచ్చించినట్లు వివరించారు. ముగింపు సభలో ఎమ్మెల్సీ వాణీదేవి, కార్పొరేటర్ సంగీత యాదవ్, మహిళా జర్నలిస్టులు మాలినీసుబ్రహ్మణ్యం, రాజేంద్రన్, సుమాబాల, శ్వేత, కవిత పాల్గొన్నారు.