ఆదిలాబాద్ రూరల్, జూలై 26 : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. వార్డు విజిట్లో భాగంగా మంగళవారం ఆదిలాబాద్లోని గాంధీనగర్, ఇందిరమ్మ కాలనీల్లో చేపడుతున్న పారిశుధ్య పనులు ఆయన పరిశీలించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉన్న చోట మున్సిపల్ యంత్రాంగంతో కలిసి ఆయిల్ బాల్తో పాటు దోమల నివారణకు రసాయనాలు పిచికారీ చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షా నేపథ్యంలో మున్సిపల్ యంత్రాంగం ద్వారా ప్రతి వార్డులో డయేరియా, మలేరియా, విష జ్వరాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నామని తెలిపారు. ప్రత్యేక బృందాల ద్వారా ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శైలజ, డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, కౌన్సిలర్ దయాకర్, నాయకులు త్రియంబక్, ప్రణయ్చారి, వెంకటేశ్, తదితరులు ఉన్నారు.
ఆదిలాబాద్ రూరల్, జూలై 26: ప్రజలు తమ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ శైలజ సూచించారు. డ్రైడే లో భాగంగా ఆదిలాబాద్లోని కేఆర్కే కాలనీలో అంకోలి పీహెచ్సీ డాక్టర్ రాహుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.
పరిసరాల శుభ్రతపై కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ సురేశ్, ఆరోగ్య సహాయకులు నల్ల ఈశ్వర్రెడ్డి, శకుంతల, ముంతాజ్, ప్రేమల, అనిత పాల్గొన్నారు.
సిరికొండ, జూలై 26 : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని డీఎల్పీవో ధర్మరాణి సూచించారు. మండలంలోని సోంపల్లి గ్రామంలో మంగళవారం ఆమె పర్యటించారు. సీజనల్ వ్యాధులు, హరితహారం, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.
గ్రామంలో ఇంటి ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ప్రతి రోజూ గ్రామంలో శానిటేషన్ చేయాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులు చూసి పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ శకుంతలబాయిని అభినందించారు. ఆమె వెంట ఎంపీవో అతుల్, సర్పంచ్ శకుంతలబాయి, పంచాయతీ కార్యదర్శి సునీల్, టీఆర్ఎస్ నాయకులు కందం సూర్యకాంత్, ఈశ్వర్ ఉన్నారు.
ఇచ్చోడ, జూలై 26 : గ్రామాల్లో ప్రజలకు వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీఎల్పీవోధర్మరాణి పేర్కొన్నారు. మండలంలోని దాబా(బీ), మాదాపూర్ గ్రామాల్లో ఆమె పర్యటించారు. పారిశుధ్య పనులను పరిశీలించారు. పారిశుధ్య నివారణ పనులపై పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. నిర్లక్ష్యం చేసే వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట ఎంపీవో కొమ్ము రమేశ్, పంచాయతీ కార్యదర్శులు భోజారెడ్డి, సునీల్ నాయక్, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
భీంపూర్, జూలై 26: భీంపూర్, అందర్బంద్, కామట్వాడ, అంతర్గాం, కరంజి(టీ), అర్లి(టీ) గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టారు. మురుగు కాలువలు శుభ్రం చేసి క్లోరినేషన్ చేశారు. బావులు, రక్షిత తాగునీటి ట్యాంకులు శుభ్రం చేసి బ్లీచింగ్పౌడర్ చల్లారు. ఈ పనులను సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పరిశీలించారు.