తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని జీవనది ప్రాణహిత పుష్కర వేడుకలకు సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి 24 వరకు 12 రోజుల పాటు వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. స్వరాష్ట్రంలో మొదటిసారి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేస్తున్నది. దీనిపై ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
– మంచిర్యాల, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ)
గోదావరికి అతి పెద్ద ఉపనది అయిన ప్రాణహిత పుష్కర శోభ సంతరించుకో నున్నది. రాష్ట్రంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడి హెట్టి గ్రామం వద్ద ఉద్భవించి, ఆ జిల్లాలోని బెజ్జూర్, మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కోటపల్లి మండలాల మీదుగా పయనిస్తున్నది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో కలుస్తున్నది. కాగా, పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికే పలు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. పోలీస్ శాఖ తరఫున సీపీ చంద్రశేఖర్ రెడ్డి, డీసీపీ అఖిల్ మహాజన్, జైపూర్, బెల్లంపల్లి ఏసీపీలు నరేందర్ రెడ్డి, ఎడ్ల మహేశ్, సీఐ నాగరాజు, ఇతర అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.
పుష్కరాలపై అవగాహన పెరగడం, రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో ఈసారి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 2010లో నిర్వహించిన పుష్కరాల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టితో పాటు జిల్లాలోని వేమనపల్లి, కోటపల్లి మండలం అర్జున గుట్ట, భూపాలపల్లి జిల్లా లోని కాళేశ్వరం వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అర్జునగుట్ట వద్ద అధికారికంగా ప్రారంభించారు. గత పుష్కరాల్లో రోజుకు 50వేల మంది చొప్పున 12 రోజుల్లో సుమారు 6 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిం చారు. అప్పుడు సరైన రవాణా సౌకర్యాలు లేకున్నా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుతం రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. అర్జున గుట్ట- సిరొంచ మధ్య గోదావరి నదిపై వంతెనలు నిర్మించారు. తదనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల 13 నుంచి 24 వరకు 12 రోజుల పాటు ప్రాణహిత నదికి పుష్కరాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, విద్యుత్ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రాణహిత పుష్కరాల ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇదివరకే రాపనపల్లి సమీపంలోని అంతర్రాష్ట్ర వంతెన వద్ద, అర్జున గుట్ట సమీపంలో ఘాట్ల ఏర్పాటుపై పలు సూచనలు చేశారు. దేవులవాడ సమీపంలోని ప్రాణహిత నదిని సందర్శించి పలు సూచనలు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఇదివరకే అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.
పుష్కర ఘాట్లు, రహదారులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రాణహిత పుష్కరాల ముందస్తు ఏర్పాట్లకు సంబంధించి నిధులు అందించాలని ఇటీవల అసెంబ్లీలోనూ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. స్నానపు ఘాట్లు, వేసవి దృష్ట్యా భక్తులు సేద తీరేందుకు చలువ పందిళ్లు, క్యూలైన్ల ఏర్పాటు, మరుగుదొడ్లు, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు.