బెల్లంపల్లి టౌన్, మే 15 : బెల్లంపల్లి పట్టణంలోని షంషీర్నగర్కు చెందిన రామ భక్తురాలు వేముల మానస వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది. స్వతహాగా శ్రీరాముడికి అమిత భక్తురాలైన మానస.. అనర్గళంగా 150 నిమిషాల్లో రామాయణంలోని 2800 శ్లోకాలు చెప్పి. రికార్డు సృష్టించింది. ఈ రంగంలో ఎవరూ సాధించని ఘనతను సొంతం చేసుకుంది. ఏప్రిల్ 28న మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మానస ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డు’ సాధించి సర్టిఫికెట్లు అందుకున్నది.
ఓ టీవీ ఛానల్లో ప్రసారమైన రామాయణాన్ని చూసి మానస ప్రేరితమైంది. పోస్టాఫీస్ బస్తీకి చెందిన ఎలిగేటి మల్లేశ్, లక్ష్మి దంపతుల తృతీయ కుమార్తె మానస. మల్లేశ్ సీనియర్ మైనింగ్ సర్దార్గా పనిచేసేవారు. మానస పదో తరగతి వరకు బెల్లంపల్లి శిశుమందిర్ పాఠశాలలో చదివింది. ఇంటర్ స్ధానికంగా ప్రైవేట్ కళాశాలలో, డిగ్రీ మందమర్రిలోని ఓ ప్రైవేట్ మహి ళా డిగ్రీ కళాశాలలో అభ్యసించింది. సిద్దిపేటలో ఎంబీఏ చదువుతున్న క్రమంలో 2009లో ప్రాజెక్ట్ వర్క్ కోసం కొత్తగూడెం వెళ్లింది. బెల్లంపల్లి నుంచి కొత్తగూడెంకు బదిలీపై వెళ్లిన తండ్రి మల్లేశ్ ఇంటికి వెళ్లింది. అదేరోజు రాత్రి ఓ చానల్లో ప్రసారమైన రామాయణాన్ని తిలకించింది. సీతమ్మ భూమిలోకి వెళ్లే ఘట్టాన్ని నిశితంగా చూసింది. అప్పటి నుంచి ఆమె మనసు ఆధ్యాత్మికంగా శ్రీరాముడి వైపు మళ్లింది.
రామాయణంలో ఓ సన్నివేశం చూసిన అనంతరం ఆమె పూర్తిగా శ్రీరాముడి ఆరాధన వైపు మళ్లింది. ప్రతిరోజూ రాత్రి ఆమెకు శ్రీరాముడి కలలు వచ్చేవి. కొన్ని రోజుల తర్వాత ఏ దృశ్యం చూసినా, ఎక్కడ చూసినా రాముడిని ఆకారం కనిపించేది. టీవీ చూసినా, పుస్తకం చదివినా ఆయన ప్రతిరూపమే దర్శనమిచ్చేది. ఈ క్రమంలో రామాయణం పుస్తకాన్ని కొనుగోలు చేసింది. 2013లో ఆమె రామాయణంలోని మొదటి శ్లోకాన్ని ఉచ్చరించింది. ‘మనీషాగా వాల్మీకి’ శ్లోకాన్ని పూర్తిగా కంఠస్తం చేసింది. అప్పటి నుంచి ఒక్కో శ్లోకం సాధన చేసి నిర్విరామంగా నేర్చుకుంది. వివాహం అనంతరం కూడా ఆమె శ్లోకాల పఠనం వదలలేదు. తనకు ఏ వ్యాపకం లేనట్లుగా నిరంతరం సాధన చేసింది. శ్లోకాలకు సంబంధించి పేపర్లో రాసుకోవడం, కంఠస్తం చేయడం విస్తృతంగా చేసింది. ఎటు వెళ్లినా శ్లోకాలు నేర్చుకోవడానికే ఎక్కువ సమయం కేటాయించేది.
దేవాలయాల్లో ఆమెను మానసకు బదులు రామభక్తురాలు అని పిలుస్తుంటారు. రాముడు తిరిగిన స్ధలాలను సందర్శించాలనే సంకల్పంతో తన తల్లిదండ్రుల సహకారంతో వెళ్లి తిలకించింది. అయోధ్య నందిగ్రామం, శృంగభేరి పురం, ప్రయాగ, చింతకుంట్ల, పంచవటి, కైకేయి నగరం, ఇతర రాముని ప్రదేశాలను సందర్శించింది. భద్రాచలంలో రాముడి విగ్రహం సమర్పణ, స్ధానిక కోదండ రామాలయంలో గరుడ వాహనం, రాముని కవచం, వెండి నగలు బహూకరించి తన భక్తి భావాన్ని చాటుకున్నది. స్ధానికంగా ఉన్న కోదండ రామాలయం, ఇతర ఆధ్యాత్మిక కేంద్రాల్లో రామాయణం శ్లోకాలను పఠించడం, ప్రవచనాలను బోధించడంతో భక్తుల్లో ఆమెపై ప్రత్యేకత పెరిగింది. దీంతో మానస పేరు రామభక్తురాలైంది.
నా ప్రాణం ఉన్నంత వరకు శ్రీరాముడి సేవలోనే తరిస్తా. రామాయణం చూసి శ్రీరాముడికి పరమ భక్తురాలినయ్యా. దీంట్లో భాగంగానే రాముడి శ్లోకాలను పఠనం చేశా. నేను వండర్ బుక్ ఆఫ్ రికార్డు సాధిస్తానని అనుకోలేదు. దేవాలయాల్లో శ్లోకాలు చదివి, ప్రవచనాలు బోధించేదాన్ని. వారు కొన్ని నెలల నుంచి పరిశీలించారు. వండర్ రికార్డు ప్రతినిధి రామ్ప్రకాశ్ శ్లోక పఠనం వీడియో రికార్డింగ్ చేసి వండర్ బుక్ రికార్డుకు పంపించారు. గతనెల 28న తనకు ఈ రికార్డును మంచిర్యాలలో ఇచ్చారు. నా తల్లిదండ్రులు, భర్త శ్రీనివాస్ సహకారంతోనే రికార్డు సాధించా.
– మానస, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత