తాంసి, మే 14 : తాంసి మండలం కప్పర్లలోని పంట చేలల్లో శనివారం రైతులకు చిరుతపులి కనిపించింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో కే మ పరమేశ్వర్ తన చేనులో జొన్న కోస్తుండగా వా రి కంటపడింది. విషయాన్ని సర్పంచ్ సదానందం కు తెలుపగా, ఆయన ఫారెస్ట్, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రేమ్సింగ్, ఎఫ్బీవో శరత్రెడ్డి, ప్రజాప్రనిధు లు, గ్రామస్తులతో కలిసి చిరుత కనిపించిన స్థలానికి చేరుకున్నారు.
చేనులోని పొదల్లో వెతుకుంతుండగా, వారిని చూసిన చిరుత పారిపోయింది. ఈ సందర్భంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రేమ్సింగ్ మాట్లాడుతూ.. గ్రామస్తులు, రైతులు చిరుత విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చిరుత ఒక్కచోటే స్థిరనివాసం ఏర్పరుచుకోదని, దాదాపు 25 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా ఉండవచ్చని తెలిపారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించామని పేర్కొన్నారు. చేలల్లోకి వెళ్లే ర ఐతులు శబ్ధాలు చేస్తూ వెళ్లాలని సూచించారు. చిరుత ఆనవాళ్లకోసం కొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయన వెంట సర్పంచ్ సదానందం, మాజీ ఎంపీటీసీ మహేందర్, రైతులు, గ్రామస్తులు ఉన్నారు.
మండలంలో చిరుత పులులు తరచు ప్రజలకు కనబడుతున్నాయి. ఏడాది క్రితం పల్లె ప్రగతి కార్యక్రమానికి ఉదయం వేళ వెళ్తున్న అంబుగాం పంచాయతీ కార్యదర్శికి నడిరోడ్డుపై కనిపించింది. వెంటనే స్థానికులకు సమాచారం అందించారు. గ్రామస్తులు చిరుతను అడవిలోకి తరిమేశారు. అలాగే 2019లో తాంసి సమీపంలోని బోడగుట్టపై ఓ చిరుత చనిపోయి కనిపించింది. దీంతో మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
భీంపూర్, మే14 : కప్పర్లలో చిరుత సంచారంతో భీంపూర్ మండలం నిపాని, పిప్పల్కోటి, తాంసి(కె) తదితర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కప్పర్ల గ్రామానికి పిప్పల్కోటి, నిపాని గ్రామాలు సమీపంగానే ఉన్నాయి. ఈ విషయంలో సంరక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఎఫ్బీవో కేశవ్ తెలిపారు.