నీలి విప్లవానికి సమయం ఆసన్నమైంది. నైరుతి రుతుపవనాలు వచ్చే నెల రాష్ట్రంలో ప్రవేశిస్తాయని వాతావరణశాఖ తెలుపడంతో మత్య్సశాఖ అధికారులు అప్రమత్తమ య్యారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,461 చెరువులు, 12 చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు ఉండగా.. వీటిలో 9.58 కోట్ల చేపపిల్లలు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
రెండు సైజుల్లో బిల్డర్ల నుంచి కొనుగోలు చేయడానికి టెండర్లు ఆహ్వానించింది. ఈనెల 15 నుంచి 31 వరకు ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. వచ్చే నెల 5వ తేదీన ఓపెన్ చేయనున్నారు. ఈసారి ప్రధానంగా రవ్వు, బొచ్చ, బంగారుతీగ, వంటి మేలు రకం వాటికి ప్రాధాన్యత ఇచ్చారు. నీలి విప్లవం వెల్లివిరుస్తుండడంతో మత్య్సకారుల కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. –
నిర్మల్ టౌన్, మే 14 : జూన్ 8వ తేదీన నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో చేప పిల్లల పంపిణీకి సర్కారు చర్యలు చేపట్టింది. మత్స్యకారులు ఆర్థిక భరోసా పొందడానికి తెలంగాణ ప్రభుత్వము యేటా మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఈ యేడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,461 చెరువులు, ఎనిమిది చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు ఉండగా.. వీటిలో 9.58 కోట్ల చేప పిల్లలు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రొక్యుర్మెంట్ ద్వారా ఈనెల 15 నుంచి 31 వరకు నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో టెండర్లు ఆహ్వానించింది. ఈ మేరకు జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో బిల్డర్లు దరఖాస్తు చేసుకోనున్నారు. ఎవరు తక్కువ పైసలకు చేప పిల్లలు అందిస్తే వారికి టెండరు దక్కనుంది. అనంతరం చెరువులు, ప్రాజెక్టుల్లో చేప పిల్లలను వదలనున్నారు.
2016 నుంచి తెలంగాణ ప్రభుత్వము ఉచితంగా చేపపిల్లల పంపిణీని పెద్ద ఎత్తున చేపడుతున్నది. ఉమ్మడి జిల్లాలో చెరువులతోపాటు శ్రీరాంసాగర్, గడ్డెన్న, స్వర్ణ, కడెం, పల్సిరంగారావు, సాత్నాల, వట్టివాగు, కుమ్రం భీం, కరత్వాడ ప్రాజెక్టుల్లో విడుదల చేయనున్నారు. గతంలోనే పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోని చెరువులను ప్రభుత్వం మత్స్యశాఖకు అప్పగించింది. దీంతో ఈసారి కొత్తగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
ఉమ్మడి జిల్లాలో 450కి పైగా మత్స్యకార్మిక సంఘాలుండగా.. 20 వేలకు పైగా మత్స్య కార్మికులు చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరందరికీ చేప పిల్లల పంపిణీ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. నిర్మల్లో 696 చెరువులు, ఐదు ప్రాజెక్టుల్లో 4.58 కోట్ల చేప పిల్లలు, ఆదిలాబాద్లో 225 చెరువులు, మూడు ప్రాజెక్టుల్లో 1.50 కోట్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 261 చెరువులు, రెండు ప్రాజెక్టుల్లో 1.50 కోట్లు, మంచిర్యాలలో 279 చెరువులు, రెండు ప్రాజెక్టుల్లో 2 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని మత్స్యశాఖ లక్ష్యంగా పెట్టుకొని టెండర్లకు ఆహ్వానిస్తున్నది.
రెండు సైజుల్లో చేప పిల్లలను పంపిణీ చేసేందుకు టెండర్లను ఆహ్వానిస్తున్నది. ఇందులో బొచ్చ, రవ్వ, బంగారు తీగ, లోకల్ చేప పిల్లలు ఉండనున్నాయి. 30-40 మి.మీ. చేప పిల్లకు 61 పైసల చొప్పున, 80-100 మి.మీ. చేప పిల్లకు 1.63 పైసల చొప్పున ప్రభుత్వం ధరను నిర్ణయించింది.
బిల్డర్లు ఉమ్మడి జిల్లాలో 14 మంది ఉండగా.. ఇతర జిల్లాల నుంచి కూడా బిల్డర్లు తక్కువ ధరకు కోట్ చేస్తే వారికి టెండర్ దక్కనుంది. వచ్చే నెల 5వ తేదీన టెండర్లు ఎవరికి దక్కాయో జిల్లా మత్స్యశాఖ అధికారులు తెలుపనున్నారు. ఈ పక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని నిర్మల్ జిల్లా మత్స్యశాఖ అధికారి నర్సింహారావు తెలిపారు.