నేరడిగొండ, మే 12 : అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నేరడిగొండలోని ప్రాథమిక పాఠశాలలో మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను గురువారం పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ సూచించారు. అనంతరం స్థానిక నర్సరీని పరిశీలించి మొక్కల సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పీహెచ్సీలో పరిసరాలను పరిశీలించారు.
దవాఖాన పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విధులు సక్రమంగా నిర్వహించాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. అనంతరం బుద్దికొండకు వెళ్లే రోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. ఎండ నుంచి మొక్కలను కాపాడేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో కలెక్టర్ నాటిన మొక్కను గుర్తు చేసి నీళ్లు పోశారు. పక్కనే ఉన్న సెగ్రిగేషన్ షెడ్ను పరిశీలించి సేంద్రియ ఎరువు తయారు విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి బోథ్ ఎక్స్రోడ్డు వద్ద గల అర్బన్ పార్కు పనులను పరిశీలించారు.
ఉపాధిహామీ పనులను చూశారు. కొలతలు సరిగా ఉండేలా చూడాలన్నారు. ఉపాధిహామీ పనుల తీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జాదవ్ అనిల్, ఎంపీపీ రాథోడ్ సజన్, సర్పంచ్ పెంట వెంకటరమణ, డీఆర్డీవో కిషన్, డీపీవో శ్రీనివాస్, అదనపు డీఆర్డీవో రాథో డ్ రవీందర్,ఎంపీడీవో అబ్దుల్సమద్, నాయబ్ తహసీల్దార్ జగదీశ్వరి, ఎంఈవో అన్రెడ్డి భూమారెడ్డి, ఎంపీవో శోభన, ఉపసర్పంచ్ దేవేందర్రెడ్డి, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
తలమడుగు మే 12 : గ్రామీణ ప్రాంతాల యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిం చాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మండల కేంద్రంతో పాటు ఖోడద్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడారు.క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 14 ప్రత్యేక క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పారు.
తలమడుగు మండలంలో మూడు శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. తలమడుగులో క్రీడాకారులతో కలిసి కలెక్టర్ కాసేపు షటిల్ ఆడి ఉత్సాహం నింపారు. జిల్లా క్రీడాల అధికారి వెంకటేశ్వర్లు, పార్థసారథి, జడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి, సర్పంచులు కళ్లెం కరుణాకర్ రెడ్డి, ఆనంద్, ఎంపీటీసీ చంటి, తహసీ ల్దార్ ఇమ్రాన్ఖాన్, ఎంపీడీవో రమాకాంత్, ఎంఈవో నారాయణ పాల్గొన్నారు.