ట్రిపుల్ ఐటీలో 2 వేలకు పెంచే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాం..
అసెంబ్లీలో ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు మంత్రి సబితాఇంద్రారెడ్డి
భైంసా, మార్చి 24 : బాసర ట్రిపుల్ ఐటీలో సీట్ల పెంపు అంశాన్ని సీఎం కేసీఆర దృష్టికి తీసుకెళ్లి, పరిశీలిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అభ్యర్థన మేరకు బుధవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి పదిలో మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థులకు బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. ఈ క్యాంపస్ 272 ఎకరాల్లో నిర్మితమై ఉందని తెలిపారు. ఇక్కడ విద్యార్థుల అవసరాల కోసం పోస్టాఫీస్, బ్యాంక్తో పాటు 30 పడకల దవాఖాన ఏర్పాటు చేశామన్నారు. మెరుగైన విద్య అందిస్తున్నామని, దేశంలోని వెయ్యి యూనివర్సిటీల్లో బాసర ట్రిపుల్ ఐటీకి 36వ ర్యాంక్ రావడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. 50 నుంచి 55 శాతం మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఉద్యోగాలు పొందుతున్నారని తెలిపారు. ట్రిపుల్ ఐటీకి చెందిన 220 మంది విద్యార్థులు టీఎస్పీఎస్సీ నిర్వహించిన పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నియామకాల్లో ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు. ప్రస్తుతం యూనివర్సిటీలోని మౌలిక వసతులను దృష్టిలో పెట్టుకొని 1500 మందికి ప్రవేశాలు కల్పించామన్నారు. యూనివర్సిటీ ఏర్పడిన తొలి రోజుల్లో 2000 మందికి ప్రవేశాలు కల్పించినట్లు, తర్వాత మౌలిక వసతులు లేకపోవడంతో 2010లో 100 మందికి మాత్రమే ప్రవేశాలు కల్పించినట్లు తెలిపారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో 2018లో అదనంగా మరో 500 మందికి ప్రవేశాలు కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆ సంఖ్యను 2 వేలకు పెంచే అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, పరిశీలిస్తామని మంత్రి స్పష్టం చేశారు.