మామిళ్లగూడెం, జనవరి 17: తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన యువకుడు దారి తప్పాడు. జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడ్డాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. వరుస చోరీలకు పాల్పడుతున్న సదరు యువకుడిని సోమవారం ఖమ్మం టూ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం టూ టౌన్ సీఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి గ్రామానికి చెందిన దెందుకూరి గణేశ్ (25) తండ్రి ఏడాది క్రితం చనిపోయాడు. ఆరునెలల క్రితం బతుకుదెరువుకు ఖమ్మం వచ్చాడు. సమీప బంధువుల సాయంతో నగరంలోని బస్ డిపో రోడ్లో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడ్డాడు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం ఇస్తున్న జీతం గణేశ్కు సరిపోవడం లేదు. దొంగతనం చేసి తన అవసరాలు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆస్పత్రికి వచ్చిన రోగులు, వారి బంధువులకు సంబంధించిన నగదుతో పాటు ఇతర వస్తువులు అపహరించేవాడు. కొద్ది రోజుల క్రితం రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారాడు. ఈ పని చేస్తూనే చోరీలకు పాల్పడేవాడు. వారం రోజుల క్రితం గణేశ్ గతంలో తాను పని చేసిన హాస్పిటల్కు వెళ్లాడు. డాక్టర్గా నటిస్తూ ఒక టేబుల్పై ఉన్న ఓ డాక్టర్ కారు తాళాన్ని తీసుకున్నాడు. కారును అపహరించి తన ఇంటి సమీపంలో ఉంచాడు. ఆ తర్వాత నగరంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్గా నటిస్తూ ఒక మొబైల్ను అపహరించాడు. ఇలా బైపాస్ రోడ్డ్లోని ఓ దుకాణంలో ప్రింటర్, ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్లి రోగుల బెడ్ల వద్ద మూడు మొబైల్స్ను అపహరించాడు. అపహరించిన వస్తువులు, నాలుగు మొబైల్స్, కారును విజయవాడలో విక్రయించేందుకు వాటిని కారులో తరలిస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. కారును ఆపి తనిఖీ చేయగా గణేశ్ పోలీసులకు పొంతన లేని సమాధానాలిచ్చాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా చోరీల విషయం బయటపడింది. నిందితుడి నుంచి సూమరు రూ.10 లక్షల విలువ చేసే రెండు కార్లు, ఇతర వస్తువులను రికవరీ చేశారు. చోరీలపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.