కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. దీంతో వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికెళ్లి అర్హులైన వారందరికీ టీకాలు వేస్తున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, పంట చేలు, ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి వ్యాక్సినేషన్ చేపట్టారు. భద్రాద్రి జిల్లాలో ఇప్పటికే మొదటి డోస్ టీకా వందశాతం పూర్తి చేశారు. రెండో డోస్తోపాటు టీనేజ్, బూస్టర్ డోస్లు కూడా పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 40 కేంద్రాల్లో టీకాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు 14,88,003 మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతున్న వేళ భద్రాద్రి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచింది. థర్డ్వేవ్ ప్రభావంతో కేసులు పెరుగుతుండడంతో వైరస్ను అరికట్టడానికి తెలంగాణ సర్కారు కట్టదిట్టమైన చర్యలు చేపడుతోంది. కరోనా టీకా మొదటి డోస్ వంద శాతం పూర్తి చేసినప్పటికీ రెండో డోస్తోపాటు టీనేజ్, బూస్టర్ డోస్లు కూడా పూర్తి చేసేందుకు చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 14.88 లక్షల మందికి టీకాలు వేసింది. మాస్కులు ధరించని వారిపై చర్యలకు ఉపక్రమించింది. బస్సులో ప్రయాణించే వారికి సైతం ఆంక్షలు విధించి తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. రద్దీగా ఉన్న ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే విద్యాసంస్థల సెలవులను ఈ నెల 30 వరకూ పొడిగించి మరింత నియంత్రణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. కరోనా కేసులు పెరుగుతున్నందున అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతోంది. రోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో టెస్టుల సంఖ్యను పెంచింది. దీంతోపాటు కరోనా కిట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. పాజిటివ్ కేసులు పెరిగినా రోగులు హోం ఐసోలేషన్లోనే ఉంటున్నందున వారికి ఇంటికే మందులు పంపిణీ చేస్తున్నారు. గతంలో మాదిరిగానే రుచి తెలియకపోవడం, వాసన లేకపోవడంతోపాటు దగ్గు, ఇతర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి కరోనా మందులు ఇస్తున్నారు.
జనం వద్దకే వైద్య సిబ్బంది..
రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి కరోనా వల్ల ఇబ్బంది ఉండకపోవచ్చని వైద్య నిపుణులు చెప్పడంతో ధైర్యంగా ఉన్న జనం.. బూస్టర్ డోస్ వేయించుకోవడానికి కూడా ముందుకు వస్తున్నారు. మొదటి డోసు పూర్తి చేసుకున్న వారు రెండో డోస్ వేసుకుంటున్నారు. పనులకు వెళ్లిన వారు, ప్రయాణాలు చేసేవారు టీకాకు అందుబాటులో లేనందున వారిని గుర్తించి మొబైల్ సెంటర్ల ద్వారా టీకాలు వేస్తున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, ఉపాధి హామీ పనుల వద్ద టీకా కార్యక్రమాన్ని చేపట్టి వ్యాక్సిన్లు వేస్తున్నారు. టీనేజర్లకు టీకాలు వేస్తున్నారు.
14.88 లక్షలకు చేరిన టీకాలు..
వ్యాక్సినేషన్కు అర్హుల జాబితాను సిద్ధం చేసి ముమ్మరం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 14,88,003 మందికి టీకాలు వేశారు.
ఇంటి వద్దనే పాజిటివ్ బాధితులు..
కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ బాధితులు తమ ఇళ్ల వద్దనే చికిత్స పొందుతున్నారు. జిల్లాలో థర్డ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. టెస్టుల సంఖ్య పెంచడంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కట్టడిలో భాగంగా ఆసుపత్రుల్లో బెడ్లను అందుబాటులో ఉంచారు.
40కేంద్రాల్లో టీకాలు వేస్తున్నాం..
కరోనా నియంత్రణకు టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేశాం. టీనేజర్లందరికీ టీకాలు వేస్తున్నాం. బూస్టర్ డోస్కు స్పందన బాగుంది. జనాలు గుంపులుగుంపులుగా తిరగడం వల్లనే కేసులు పెరుగుతున్నాయి. భౌతికదూరం పాటించాలని, మాస్కు లు ధరించాలని చెబుతున్నాం. ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. జిల్లాలో 40 కేంద్రాలో టీకాలు వేస్తున్నాం. ఇప్పటి వరకు 14,88,003 మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.
-డాక్టర్ శిరీష, డీఎంహెచ్వో, కొత్తగూడెం