రఘునాథపాలెం, జనవరి 20: ఖమ్మం జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారుల విచారణ జరిగింది. 2015లో అశ్వారావుపేట చెక్పోస్ట్పై జరిగిన ఏసీబీ దాడిలో భాగంగా నాడు విధుల్లో ఉన్న ఎంవీఐ, ఏఎంవీఐలు కీలక బాధ్యులుగా ఉండడంతో వారిపై ఎంక్వైరీకి వచ్చినట్లు తెలిసింది. జోగులాంబ గద్వాల డీటీసీ పురుషోత్తంరెడ్డి పర్యవేక్షణలో వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య విచారణ చేపట్టారు. కేసు అశ్వారావుపేట చెక్పోస్టుకు సంబంధించినది అయినప్పటికీ అక్కడి కార్యాకలపాల ఫైల్స్ ఖమ్మం ఆర్టీఏ కార్యాలయంలో అందుబాటులో ఉండడంతో ఇక్కడ విచారణకు వచ్చినట్లు సమాచారం. ఏసీబీ విచారణకు వస్తున్నారని ముందస్తు సమాచారం ఉండడంతో కేసులో బాధ్యులైన అధికారులు ముందుగానే కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు విచారణకు వచ్చిన ఏసీబీ డీఎస్పీ సాంబయ్య.. కేసుకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు. విచారణలో భాగంగా బాధ్యులైన రవాణా శాఖ అధికారులను పలు అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. విచారణ సమయంలో ప్రస్తుత కార్యాలయ డీటీవో తోట కిషన్రావును సైతం అనుమతించలేదు. కేసు విచారణ అత్యంత గోప్యంగా జరిగినట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు కార్యాలయానికి వచ్చినట్లు తెలుసుకున్న మీడియా.. లోనికి వెళ్లే ప్రయత్నం చేయగా సిబ్బంది, అధికారులు అనుమతించలేదు. అంతేగాక నిత్యం కార్యాలయంలో వాహనాదారుల ఫైళ్లతో తెగ హడావుడి చేసే దళారులు సైతం గురువారం కార్యాలయం ప్రాంగణంలో కనిపించలేదు. ఏసీబీ విచారణ విషయమై ముందురోజే ఏజెంట్లకు కార్యాలయం నుంచి సమాచారం పంపినట్లు తెలిసింది. స్లాట్ చేసిన ఫైళ్లకు సంబంధించి నేరుగా వాహనదారులనే పంపాలని చెప్పినట్లు తెలుస్తోంది.