కొండాపూర్ : నూతన విద్యా విధానాల అమలుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్ర ప్రభుత్వం కలిసి కట్టుగా ముందుకుసాగినప్పుడే అమలు సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
ఆదివారం మాదాపూర్లోని హైటెక్స్లో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎడ్ ఎక్స్ -2021 స్కూల్ లీడర్షిప్ సమ్మిట్ ఎక్స్పోకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న నూతన విద్యా విదానాలపై దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నప్పుడే విజయవంతం అవుతాయన్నారు. రాష్ట్రాల్లో పలు రకాల సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిపై తగిన నిర్ణయాలు తీసుకోకుండా నూతన విద్యా విదానాల అమలు సాధ్య పడదన్నారు.
గతంలోను ఈ విషయంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో చర్చించినట్లు తెలిపారు. కొవిడ్ కారణంగా రెండు సంవత్సరాల పాటు విద్యా వ్యవస్థ ఎంతో నష్టపోయిందని, విద్యార్థులు సైతం తాము చదివిన అంశాలు మరిచిపోయారన్నారు. రెండు రోజుల పాటు కొనసాగే ఎడ్ ఎక్స్ కార్యక్రమంలో నూతన విద్యా విదానాలు, లీడర్షిప్ డెవలప్ మెంట్, సైకలాజికల్ లిటరసీ, ఎదురయ్యే ఛాలెంజ్ల వంటి అంశాలపై ప్రముఖులతో చర్చించనున్నట్లు తెలిపారు.
సమ్మిట్లో పాల్గొనేందుకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, తదితర రాష్ట్రల నుంచి పైవేట్ విద్యా సంస్థల నిర్వహకులు హజరయ్యారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా కన్వీనర్ ప్రసాద్ రావు, సభ్యులు యాదగిరి, రఘు, జైస్వాల్, అనిత్, రీటా, తదితరులు పాల్గొన్నారు.