భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 22 (నమస్తే తెలంగాణ): జీవనాధారం కోసం అడవిలోకి వెళ్లే ఆదివాసీల జోలికొస్తే సహించేది లేదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. ఆదివాసీ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భద్రాద్రి జిల్లాలోని ములకలపల్లి మండలం రాచన్నగూడెం పంచాయతీ సాగివాగు ఆదివాసీగూడేనికి చెందిన ముగ్గురు ఆదివాసీ మహిళల పట్ల ఫారెస్టు బీట్ గార్డులు అమానుషంగా ప్రవర్తించారన్న సంఘటనపై శనివారం ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్లను ఆదేశించారు. ఆదివాసీ మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అన్ని విధాలా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. జీవనాధారం నిమిత్తం అటవీ ఉత్పత్తుల కోసం అడవిలో వెళ్లే ఆదివాసీల జోలికి వెళ్లొద్దని అటవీ అధికారులను ఇప్పటికే పలుసార్లు హెచ్చరించామన్నారు. అయినా కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, వారిని ఉపేక్షించేది లేదని చెప్పారు. కాగా, వెంటనే విచారణ చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీవోకి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.