సుల్తాన్బజార్ : రెండు తెలుగు రాష్ట్రాలలో జరుపుకునే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రయాణీకుల సౌకర్యార్ధం ఈ యేడాది 4318 అదనపు బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ బీ వరప్రసాద్ తెలిపారు. సంక్రాంతి పండుగ సంధర్భంగా టీఎస్ఆర్టీసీ తెలంగాణ రాష్ట్రంతో పాటు అంతరాష్ట్ర బస్సులలో అదనపు చార్జీలకు మినహాయింపు ఇచ్చారు.
సాధారణ రోజులలో ఉండే చార్జీలతోనే ఆర్టీసీలో సురక్షితమైన ప్రయాణాన్ని కొనసాగించవచ్చని అధికారులు ప్రయాణీ కులకు సూచిస్తున్నారు. ఈ నెల 7 నుంచి 14 వరకు ప్రయాణీకుల సౌకర్యార్ధం తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు అదనపు బస్సులను నడపడానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించి పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు.
ఎక్కడి నుంచి ఎక్కడికి…?
సీబీఎస్ నుండి కర్నూలు, అనంతర పురం, కడప, చిత్తూరు, ఒంగోలు, మాచర్ల, నెల్లూరు వైపు స్పెషల్ బస్సులు నడపబడుతాయన్నారు. జూబ్లీ బస్ స్టేషన్, పికెట్ నుండి కరీంనగర్, నిజామాబాద్, అదిలా బాద్, మెదక్ జిల్లాల వైపు స్ఫెషల్ బస్సులు.
ఉప్పల్ క్రాస్ రోడ్ నుండి యాదగిరి గుట్ట, వరంగల్ వైపు వెళ్ళే బస్సులు. దిల్ సుఖ్ నగర్ బస్ స్టేషన్ నుండి మిర్యాల గూడ, నల్గొండ, కోదాడ, సూర్యాపేట వైపు స్పెషల్ బస్సులు నడుస్తాయని తెలిపారు.
ఇదిలా ఉండగా కాలనీలలోని 20 మంది కంటే ఎక్కువ గా ప్రయాణీకులు ఉంటే స్థానిక డిపో మేనేజర్కు సమాచారం అందిస్తే వారి వద్దకే బస్సును పంపుతామన్నారు. అన్ని పాయింట్ల వద్ద ఆర్ఎం స్థాయి నుండి డీవీఎం, డిపో మేనేజర్లు అందుబాటులో ఉండి ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారన్నారు.
ఆన్లైన్లో ప్రయాణీకులు టికెట్ బుక్ చేసుకోవడానికి www.tsrtconline.in http://www.tsrtconline.in వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రయాణీకులను కోరారు.