ఈ వారంలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్న అధికారులు
ఇప్పటికే గ్రామీణ రోడ్ల బాగుకోసం రూ.350 కోట్లు ఖర్చు చేసిన సర్కార్
నల్లగొండ, జనవరి 30 :నిత్యం రాకపోకలు, వర్షంతో దెబ్బతిన్న గ్రామీణ ప్రాంతాల రోడ్లు ఇక సాఫీగా మారనున్నాయి. ఉమ్మడి జిల్లా వాప్తంగా రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.77.65 కోట్లు విడుదల చేసింది. బ్రిడ్జిలు, కల్వర్టుల బాగు కోసం మరో రూ.5.03 కోట్లు కేటాయించింది. మొత్తం రూ.82.68 కోట్లు రాగా ఉమ్మడి జిల్లాలో 1,696 గ్రామ పంచాయతీల పరిధిలో 628 కిలోమీటర్ల మేర 194 చోట్ల పనులు చేపట్టనున్నారు. ఈ వారంలో టెండర్లు పిలిచేందుకు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పల్లెలకు రూ.350కోట్లు వెచ్చించి రోడ్లు వేయగా ఇప్పుడు వచ్చిన నిధులతో మరింత మెరుగ్గా మారనున్నాయి.
గ్రామీణ రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర సర్కార్ ఉమ్మడి జిల్లాకు రూ.82.68 కోట్లు విడుదల చేసింది. మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ కింద రూ.77.65 కోట్లు, వర్షాలకు దెబ్బతిన్న బ్రిడ్జిలు, కల్వర్టుల మరమ్మతులకు రూ.5.03 కోట్లు మంజూరు చేసింది. మెయింటెనన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ కింద నల్లగొండ జిల్లాలో 159 కిలో మీటర్ల నిడివిలో 52 పనులకు రూ.31.60 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 150 కిలో మీటర్లలో 39 పనులకు రూ.27.47 కోట్లు కేటాయించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 95 కిలోమీటర్లు 27 పనులకు రూ.18.56 కోట్ల చొప్పున మొత్తం ఉమ్మడి జిల్లాలో 404 కిలో మీటర్ల నిడివిలో 118 పనులు చేపట్టడానికి మొత్తంగా రూ.77.65 కోట్లు విడుదల చేసింది.
ఎస్టిమేట్ల తయారీలో యంత్రాంగం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,696 గ్రామ పంచాయతీలతో పాటు వాటి పరిధిలోని ఆవాసాల్లో ఉన్న రోడ్లను మరమ్మతులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసినందున ఈ పనులను చేపట్టేందుకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ప్రణాళికలు రూపొందించి అంచనాల తయారీలో నిమగ్నమైంది. ఆయా జిల్లాలకు చెందిన అధికారులు ఈ వారంలో అంచనాలు రూపొందించి వెంటనే టెండర్లు పిలిచే పనులు చేపట్టేవిధంగా చర్యలు చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రతి రోడ్డును ఆర్ అండ్బీ రోడ్డు వరకు ఈ మరమ్మతులు చేయనున్నారు.
వరద నష్టాలకు మరో రూ.5కోట్లు
ఈ వానకాలం సీజన్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షానికి మించి వర్షపాతం నమో దైంది. అంతే కాకుండా తుఫానుకు ఆయా ప్రాంతాల్లో బ్రిడ్జిలు, కల్వర్టులు కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణంగా మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని పూడ్చేందుకు సైతం ప్రభుత్వం రూ.5.03 కోట్లు విడుదల చేసింది. నల్లగొండ జిల్లాలో 90 కిలో మీటర్ల నిడివిలో 35 పనులు చేపట్టేందుకు రూ.2.17 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 176 కిలో మీటర్ల నిడివిలో 18 పనులు చేపట్టేందుకు రూ.1.76 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 73 కిలో మీటర్ల నిడివిలో 23 పనులకు గాను రూ.1.10 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయనే ఉద్దేశంతో టీఆర్ఎస్ అధికారం చేపట్టిన కొత్తలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామీణ రోడ్లు అభివృద్ధ్ది చేసేందుకు రూ.350 కోట్లు ఖర్చు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 365 రోడ్లను రెన్యువల్ చేసేందుకు రూ.185 కోట్లు ఖర్చు చేసిన సర్కార్ 126 కొత్త రోడ్లు ప్రకటించి వాటి కోసం మరో రూ.165 కోట్లు ఖర్చు చేసింది. దీనితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామం నుంచి ఆర్ అండ్ బీ రోడ్డు వరకు బీటీ రోడ్డు పడింది. అయితే ఈ రోడ్లు ఇటీవల కాలంలో దెబ్బతిన్నాయనే ఉద్దేశంతో వాటి మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.82.68 కోట్లు విడుదల చేసింది.
టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గ్రామీణ రోడ్ల మరమ్మతుకు ప్రభుత్వం రూ.82 కోట్లు మంజూరు చేసింది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ఎస్టిమేషన్లు సిద్ధ్దం చేస్తున్నది..అవి పూర్తి కాగానే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రాక పోకల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రహదారులు చెడిపోయాయి..దీనికి సంబంధించి ఇటీవల సీఎం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిధులు మంజూరు చేశారు.
-గుంటకండ్ల జగదీశ్రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి