బొడ్రాయిబజార్, జనవరి 30 : సమాజ మార్పునకు కృషి చేసిన గొప్ప దార్శనికుడు ధర్మభిక్షం అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి అన్నారు. కామ్రేడ్ ధర్మభిక్షం శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం స్థానిక త్రివేణి ఫంక్షన్ హాల్లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ‘భారతదేశ అభివృద్ధి-యువకుల కర్తవ్యం’ సెమినార్లో ఆయన మాట్లాడారు. దేశంలోని ప్రభుత్వ రంగాలన్నింటినీ పాలకులు ప్రైవేట్పరం చేస్తున్నారని, పరిశ్రమలన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయని పేర్కొనారు. దాంతో లక్షలాది మంది యువకులు ఉద్యోగాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటం ఆదర్శనీయమని కొనియాడారు. నాడు ధర్మభిక్షం ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యుడిగా రాష్ట్రంలో, దేశంలో కొత్త చట్టాల సాధనకు, ఉన్న చట్టాల అమలుకు ప్రజా పోరాటాలు నిర్వహించినట్లు తెలిపారు. ఏదైనా పోరాటాల ద్వారానే పరిష్కరించుకోవాలని చెప్పిన వ్యక్తి ధర్మభిక్షం అన్నారు. ఆయన పోరాటాలతోనే గీత కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం కృషి జరిగిందన్నారు. ధర్మభిక్షం స్ఫూర్తితో యువత నిరాశ వదిలి పోరాడి సాధించే మార్గం వైపు అడుగులు వేయాలని పునరుద్ఘటించారు. ఫిబ్రవరి 15న హైదరాబాద్లో జరిగే ధర్మభిక్షం శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉత్సవాల నిర్వహణ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఉస్తెల సృజన, అనంతుల మల్లీశ్వరి, పల్లె నర్సింహ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, నెమ్మాది వెంకటేశ్వర్లు, దోరెపల్లి శంకర్, మురగుండ్ల లక్ష్మయ్య, తలమల్ల హసేన్, పెద్దిరెడ్డి గణేశ్, గునగంటి వెంకటేశ్వర్లు, కాంపాటి రాధాకృష్ణ, బొమ్మగాని శ్రీనివాస్, బొమ్మిడి లక్ష్మీనారాయణ, నాతి సవిందర్ పాల్గొన్నారు.