కులకచర్ల, నవంబర్ 29 : అది ఒక కుగ్రామం. ఆ గ్రామానికి వెళ్లాలంటేనే ప్రజలు అబ్బో అని అనేవారు. కులకచర్ల మండల కేంద్రానికి 12 కి.మీ. దూరంలో ఉంది గోరి గడ్డతండా గ్రామ పంచాయతీ. గోరి గడ్డతండా గ్రామ పంచాయతీలో రెండు తండాలు ఉన్నాయి. గతంలో ఉమ్మడి కుస్మసముద్రం గ్రామ పంచాయతీలో అనుబంధ గ్రామం గా ఉండేది. కొత్తగా గ్రామ పంచాయతీల ఏర్పాటుతో కొన్ని తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఈ సమయంలోనే గోరిగడ్డ తండా గ్రామ పంచాయతీగా ఏర్పడింది. గోరిగడ్డతండా గ్రామ పంచాయతీలో 2011 జనా భా లెక్కల ప్రకారం 832 జనాభా ఉండగా, 680 ఓటర్లు ఉన్నారు. 162 కుటుంబాలు ఉన్నాయి.
పల్లె ప్రగతి ద్వారా మెరుగైన సౌకర్యాలు
గోరిగడ్డతండా అంటేనే మండల ప్రజలు ఏదో ఒక విధంగా అభిప్రాయపడేవారు. పూర్తిగా గిరిజన తండాలు ఉన్న గ్రామం. గ్రామంలో ఎక్కువగా వలసలు వెళ్లేవారు. తండాల్లో ఎక్కువగా ప్రజలు మహారాష్ట్రకు వలస వెళ్లేవారు. గ్రామానికి వెళితే ఎక్కువగా తండాల్లో ఇండ్లు తా ళాలు వేసి ఉండటం చూసేవారం. గ్రామంలో ముసలివారు మాత్రమే ఉండేవారు. తండాల్లో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడేవారు. గ్రామ పంచాయతీలకు నిధులు లేక గ్రామాన్ని అభివృద్ధి చేయలేక సర్పంచులు చాలా విధాలుగా ఇబ్బందులు పడేవారు. కాని పల్లె ప్రగతి వచ్చిన తరువాత గ్రామంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పడింది. గ్రామం నుంచి ఇతర తండాలకు కూడా రోడ్డు సౌకర్యం ఏర్పడింది. పల్లె ప్రగతి ద్వారా గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పల్లె ప్రగతి పేరుతో తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పంచాయతీలకు ప్రతి నెలా నిధులను కేటాయిస్తున్నది. పంచాయతీలకు కేటాయించిన నిధుల ద్వారా గ్రామ పంచాయతీ అభివృద్ధికి సర్పంచ్ నీలిబాయి కృషిచేస్తున్నారు. పల్లె ప్రగతిలో చేయాల్సిన పనులను పూర్తిస్థాయిలో చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కనువిందు చేస్తున్న పల్లె ప్రకృతివనం…
గోరిగడ్డతండా గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనం చూపరులను ఆకట్టుకుంటున్నది. పల్లె ప్రకృతి వనం లో రకరకాల మొక్కలను నాటారు.పల్లె ప్రకృతివనంలో మొక్కలు నాటడంతో పాటు వాటికి ప్రతి రోజూ నీటిని అందించడం ద్వారా పల్లె పచ్చగా మారింది.
నర్సరీ ఏర్పాటు…
గోరిగడ్డతండా సమీపంలో ఏర్పాటు చేసిన నర్సరీలో మొ క్కలు ఏపుగా పెరిగాయి. మొక్కల రక్షణకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వనసేవకున్ని నియమించి నర్సరీలో మొక్కలు పెంచేందుకు సర్పంచ్ కృషిచేస్తున్నారు.
వినియోగానికి డంపింగ్ యార్డు
గోరిగడ్డతండా సమీపంలో ఉన్న డంపింగ్యార్డు నిర్మా ణం పూర్తికావడంతో సేంద్రియ ఎరువులు తయారు చేయ డానికి ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే డంపింగ్యార్డులో పేడ, చెత్తద్వారా ఎరువును తయారు చేస్తున్నారు. గ్రామం లో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గ్రామ పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నారు.
పూర్తైన వైకుంఠధామం
గోరిగడ్డతండా గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతిలో భా గంగా ఏర్పాటు చేసిన వైకుంఠధామం నిర్మాణ పనులు పూర్తిదశకు చేరుకున్నాయి. పెద్ద గుట్టలా ఉన్న ప్రదేశాన్ని వైకుంఠధామానికి పనికి వచ్చేలా చేశారు. దీంతో వైకుంఠ ధామం పనులు కూడా పూర్తయ్యాయి.
ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి సరఫరా…
పల్లె ప్రగతికి పూర్వం గ్రామంలో నీటి సమస్య ఉండేది. గ్రామ పంచాయతీ ద్వారా నీటిని అందించేవారు. వేసవికాలంలో నీటికోసం ఇబ్బందులు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామాలకు తాగునీటిని అందించేందుకు మిషన్ భగీరథ నీటిని అందించడంతో ఇంటింటికీ నీటి సరఫరా కొనసాగుతున్నది. మిషన్ భగీరథ పుణ్యమా అని గ్రామంతో పాటు తండాల్లో కూడా నీటి సమస్య చాలా వరకు తగ్గింది.