బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
తాండూర్ పీహెచ్సీ తనిఖీ
వైద్యులు లేకపోవడంతో డీఎంహెచ్వోకు ఫిర్యాదు
తాండూర్, మే 29 : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. స్థానిక ఎంపీపీ పూసాల ప్రణయ్కుమార్తో కలిసి మండలకేంద్రంలోని పీహెచ్సీని శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అందుతున్న సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. సమయం 11:15 గంటలవుతున్నా డాక్టర్ రాలేదని పేషెంట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే డీఎంహెచ్వోతో ఫోన్లో మాట్లాడారు. పీహెచ్సీలో ముగ్గురు డాక్టర్లకు ఒక పోస్టు ఖాళీగా ఉందని, మరొకరు డిఫ్యూటేషన్పై వెళ్లారని, ప్రస్తుతమున్న డాక్టర్ కుమారస్వామి బెల్లంపల్లి ప్రధాన దవాఖానలో మీటింగ్లో ఉన్నారని డీఎంహెచ్వో తెలిపారు. వారంరోజుల్లో వైద్యులను నియామకానికి చర్యలు తీసుకుంటానని డీఎంహెచ్వో పేర్కొన్నారు. అనంతరం దుర్గం చిన్నయ్య విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో కరోనా పరిస్థితులపై ఆరా తీశారు. కరోనా పరీక్షలు, పాజిటివ్ కేసుల సంఖ్య, వ్యాక్సిన్ వివరాలను సిబ్బంది ఆయనకు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేద ప్రజల కోసం ఉచితంగా వైద్యం, మందులు అందజేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా సెకండ్ ఏఎన్ఎంలు తమను రెగ్యులరైజ్ చేసేలా చూడాలని ఎమ్మెల్యేను కోరగా, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో సీఐ కోట బాబురావు, ఎస్ఐ సీహెచ్ కిరణ్కుమార్, తాండూర్ ఇన్చార్జి సర్పంచ్ నవీన్కుమార్, కో ఆప్సన్ సభ్యుడు నజ్జీఖాన్, కొమ్మెర లక్ష్మణ్, అభినవ సంతోష్, శివ, పీహెచ్సీ సిబ్బంది ఉన్నారు.
డ్రైఫూట్స్, మెడికల్ కిట్ల అందజేత..
అభినవ సంస్థ అధ్యక్షుడు సంతోశ్కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పీహెచ్సీ ఆవరణలో కొవిడ్ రోగులకు డ్రై ఫ్రూట్స్, ఓఆర్ఎస్ లిక్విడ్ ప్యాకెట్స్, భోజనం, మెడికల్ కిట్స్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభినవ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 59 రోజులుగా సంస్థ అధ్యక్షుడు సంతోష్కుమార్, సభ్యులు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. హోం ఐసొలేషన్లో ఉంటున్న వారికి కూడా భోజనం అందిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు సంతోష్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్, ఎంపీపీ పూసాల ప్రణయ్కుమార్, మండల కో ఆప్సన్ సభ్యుడు నజ్జీఖాన్, తాండూర్ ఇన్చార్జి సర్పంచ్ పూదరి నవీన్కుమా ర్, సీఐ కోట బాబురావు, ఎస్ఐ కిరణ్కుమార్, అభినవ సభ్యులు పొట్లపల్లి రాజ్కిరణ్, ఒడ్నాల మల్లేశ్, తొగరి శ్రీనివాస్, కుమార్, హెల్త్ అసిస్టెం ట్ ధనుంజయ్, పీహెచ్సీ సిబ్బంది హరీశ్, హకీం, ఆరోగ్యమిత్ర లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ సందర్శన
బెల్లంపల్లిరూరల్, మే 29: బెల్లంపల్లి పట్టణంలోని శంషీర్నగర్లోని అర్బన్ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనిఖీ చేశారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంపై వైద్య సి బ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. బెల్లంపల్లి మున్సిపల్ వైస్చైర్మన్ బత్తుల సుదర్శన్ , టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మెర లక్ష్మణ్ ఉన్నారు.