తెలంగాణ వచ్చాకే రూ.4 వేల కోట్లతో 8 మెడికల్ కాలేజీలు
త్వరలో రేడియాలజీ యూనిట్, క్యాన్సర్ స్క్రీనింగ్ పరికరం
రాష్ట్రంలో చేపట్టిన ‘ఇంటింటి జ్వర సర్వే’ సూపర్ హిట్
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు
రామవరంలో మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభం
పాల్వంచలో మెడికల్, నర్సింగ్ కళాశాలల నిర్మాణాల పరిశీలన
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 29 (నమస్తే తెలంగాణ): 70 ఏళ్ల ఆంధ్రా పాలనలో తెలంగాణకు ఎన్నడూ మెడికల్ కాలేజీలు మంజూరు చేయలేదు. తెలంగాణ వచ్చాకే మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఒక విజన్తో ముందుకెళ్తున్నారని, భద్రాద్రి జిల్లాకు మెడికల్ కాలేజీ రావడం ఒక వరమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరంలో రూ.18 కోట్లతో నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం పాల్వంచ సమీపంలోని నవభారత్ ఏరియాలో 25 ఎకరాల్లో చేపట్టిన మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశమంతా మనవైపు చూసేలా కొవిడ్ నియంత్రణ కోసం ఇంటింటి జ్వర సర్వే చేపట్టి ప్రతి ఒక్కరికీ మందులు ఇచ్చామని పేర్కొన్నారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ రామవరంలో ప్రారంభించిన ఆసుపత్రిలో తక్షణమే తల్లీబిడ్డలకు సేవలు అందించాలన్నారు.
మారుమూల ప్రాంతాలకు వైద్య సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఒక విజన్తో ముందుకు వెళ్తున్నారని, భద్రాద్రి జిల్లాకు మెడికల్ కాలేజీ రావడం ఒక వరమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో రామవరంలో రూ.18 కోట్లతో నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఆసుపత్రిని మంత్రి హరీశ్రావు, వివిధ యూనిట్లను మరో మంత్రి అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం పాల్వంచ సమీపంలోని 25 ఎకరాల్లో చేపట్టిన మెడికల్, నర్సింగ్ కాలేజీల పనులను మంత్రి హరీశ్రావు పరిశీలించారు. కలెక్టర్ అనుదీప్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 70 ఏళ్ల ఆంధ్రా పాలనలో తెలంగాణకు ఎన్నడూ మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన దాఖలాలు లేవని మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ వచ్చాకే మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయని గుర్తుచేశారు. గతంలో నాలుగు కాలేజీలు మంజూరు చేసి ప్రారంభోత్సవాలు చేసుకోగా ఇప్పుడు మరో 8 కాలేజీలను రూ.4 వేల కోట్లతో మంజూరు చేసుకున్నామని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాలా మారుమూలగా ఉందని, మెరుగైన వైద్య కోసం వెళ్లాలంటే హైదరాబాద్ తప్ప మరో దారి లేదని అన్నారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని భద్రాద్రికి సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీ మంజూరు చేశారని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 8 మెడికల్ కాలేజీ వల్ల 1,050 అడ్మిషన్లు ఉంటాయన్నారు. దీంతోపాటు భద్రాద్రి మెడికల్ కాలేజీకు అనుసంధానంగా 900 బెడ్లతో ఆసుపత్రి నిర్మాణం జరగబోతుందన్నారు. రామవరంలో ప్రారంభించిన ఎంసీహెచ్లో వంద బెడ్లతో తల్లీపిల్లకు అధునాతన సౌకర్యాలతో మెరుగైన వైద్యం అందుతుందన్నారు. రూ.10 లక్షల వ్యయంలో వెంటిలేటర్లనూ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పిల్లలకు ప్రత్యేకంగా 20 బెడ్లు, తల్లులకు 100 బెడ్లు, అల్ట్రా స్కానింగ్, సీటీ స్కానింగ్, కొవిడ్ థియేటర్ వంటివన్నీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. రేడియాలజీ యూనిట్, క్యాన్సర్ స్క్రీనింగ్ పరికరం మంజూరు చేస్తామన్నారు.
జ్వర సర్వే సూపర్ హిట్..
దేశమంతా మనవైపు చూసే విధంగా కొవిడ్ నియంత్రణ కోసం ఇంటింటి జ్వర సర్వే చేసి ప్రతి ఒక్కరికీ మందులు ఇవ్వగలిగామని మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ కరోనా కట్టడికి ముందస్తు చర్యలు తీసుకొని 2 వేల కోట్లు కొవిడ్ కిట్లను సిద్ధం చేసి పరీక్షలు చేయించారన్నారు. ఇంటింటి జ్వర సర్వే సూపర్ హిట్ అయిందని, జ్వరాలు కూడా అదుపులోకి వచ్చాయని అన్నారు. ఇతర రాష్ర్టాలు కూడా ఇదే ఫార్ములా అమలు చేస్తున్నాయని గుర్తుచేశారు.
వేగం పెంచాలి: మంత్రి అజయ్కుమార్
మెడికల్ కాలేజీకి అనుసంధానంగా జిల్లా ఆసుపత్రి పైభాగంలో నిర్మిస్తున్న 180 బెడ్ల ఆసుపత్రిని వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. ఈ విద్యాసంవత్సరంలోనే తరగతులు ప్రారంభం కానున్నందున ఫిబ్రవరి చివరి నాటికి పనులు పూర్తి చేసి అందించాలని ఆదేశించారు. రామవరంలో ప్రారంభించిన ఆసుపత్రిలో తక్షణమే తల్లీబిడ్డలకు సేవలు అందించాలన్నారు. మెడికల్ కాలేజీ, నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం వంటివన్నీ ఐదు నియోజకవర్గాలకు కేంద్రంగా ఉండబోతున్నాయన్నారు.
ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్, డీఎంఈ రమేశ్రెడ్డి, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ తాతా మధు, టీఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, రైతుబంధు సమితి ఖమ్మం జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ ముక్కంటేశ్వరావు, సూపరింటెండెంట్ డాక్టర్ సరళ, అడిషినల్ డీఎంహెచ్వో దయానందస్వామి, వార్డు కౌన్సిలర్ కంచర్ల జమలయ్య తదితరులు పాల్గొన్నారు.