పెద్దేముల్, నవంబర్ 28 : యువత భగవద్గీతను, అందులోని శ్లోకాలను చదివి వాటి సారాంశాన్ని తెలుసుకోవాల్సిన అవసరముందని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని హనుమాన్ మందిర ఆవరణలో శ్రీ మద్భాగవద్గీత లక్ష యువగళ గీతార్చన కార్యక్రమ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్పీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి యువకుడు భగవద్గీతను చదువాల్సిన అవసరం ఉందని,ముఖ్యంగా యువత భగవద్గీతను చదువుతూ అందులోని శ్లోకాల సారాంశాన్ని అర్థం చేసుకొని మన జీవన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. డిసెంబర్ 14న హైదరాబాద్లో ‘భగవద్గీత జీవన గీత-ప్రేరణ గీత’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న ‘లక్ష యువ గళ గీతార్చన’లో ఎక్కువ సంఖ్యలో గ్రామీణ, పట్టణ యువకులు భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తులు వెంకటయ్య, శ్రీశైలం, ఆనందం, శ్రీనివాస్, కిరణ్, లింగం, వేదాంతాచారి, నర్సింహులు, శోభారాణి, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీలత పాల్గొన్నారు.
భక్తి శ్రద్ధలతో భగవద్గీత పారాయణం
కొడంగల్, నవంబర్ 28: హస్నాబాద్ గ్రామంలో బాలంపేటకు చెందిన శివానంద స్వామి వారిచే భగవద్గీత పారాయణం భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నది. ఈనెల 23 నుంచి ప్రారంభమైన భగవద్గీత పారాయణం డిసెంబర్ 14 వరకు కొనసాగనున్నట్లు ప్రవచకులు తెలిపారు. గ్రామంలోని భీమరాముని దేవాలయంలో ప్రతి రోజూ సాయంత్రం 7.30 గంటల కు కార్యక్రమం ప్రారంభమవుతుంది. హిందువులకు అత్యంత పవిత్ర గ్రంథంగా కొనసాగుతున్న భగవద్గీతను ప్రతి ఒక్కరూ తప్పకుండా చదువుకోవాలని, లేదా ఇటువంటి ప్రవచనాల్లో గీతా సారాంశాన్ని గ్రహించాలని వారు కోరారు.