రామచంద్రాపురం, నవంబర్ 28 : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం తెల్లాపూర్ నైబర్ హుడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ కమ్యూనిటీ క్రీడాపోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. తెల్లాపూర్, నలగండ్ల పరిధిలోని 50కిపైగా గేటెడ్ కమ్యూనిటీస్కి చెందిన 650 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. టెన్నిస్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, వాలీబాల్, షెటిల్, క్రికెట్ పోటీలను నిర్వహించారు. అదేవిధంగా సాన్సియా విల్లాస్లో నూతనంగా ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటితరం విద్యార్థులు, యువతరం టెక్నాలజీ వైపు దూసుకెళ్తున్న ఈ తరుణంలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించేలా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం పెంపొందడంతోపాటు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతాయన్నారు. ప్రపంచంతో పోటీ పడుతూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శరీరానికి సరైన వ్యాయామం లేకపోతే రోగాల బారినపడే అవకాశం ఉంటుందన్నారు. ఒకే చోట కూర్చొని కంప్యూటర్ ఉద్యోగం చేసే వారు తప్పనిసరిగా ప్రతిరోజూ కొంత సమయాన్ని వ్యాయామం లేదా క్రీడలకు కేటాయించాలని సూచించారు. అంతకుముందు గేటెడ్ కమ్యూనిటీలోని స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి, నాయకులు ఉమేశ్వర్, ఇందిరారెడ్డి, రవీందర్రెడ్డి, నైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ తదితరులు ఉన్నారు.