అదనపు కలెక్టర్ రఘురాం శర్మ
గద్వాల, జూలై 28 : విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అదనపు కలెక్టర్ రఘురాం శర్మ ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని బాలభవన్లో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలెబుల్ పాఠశాలకు విద్యార్థుల ఎంపిక కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్కీ డిప్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. బెస్ట్ అవైలెబుల్ పాఠశాలకు ఎంపికైన విద్యార్థులు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బెస్ట్ అవైలెబుల్ పాఠశాలకు స్కీం ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను లక్కీ డిప్ ద్వారా 1వ తరగతికి (డే స్కాలర్స్)23మందిని, 5వ తరగతికి(రెసిడెన్షియల్)23మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న బెస్ట్ అవైలెబుల్ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలతోపాటు ఉచిత భోజనం, యూనిఫాం అందిస్తారన్నారు. రెసిడెన్షియల్ విద్యార్థులకు హాస్టల్ వసతి ఉంటుందన్నారు. ఎంపికైన విద్యార్థులు జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయంలో సంప్రదించి వారికి కావాల్సిన పాఠశాలలో అడ్మిషన్ కోసం దరఖాస్తును ఈ నెల 31వరకు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారులు శ్వేతాప్రియదర్శిని, రమేశ్బాబు పాల్గొన్నారు.
తాసిల్దార్ కార్యాలయం పరిశీలన
ఉండవెల్లి, జూలై 28 : మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ రఘురాంశర్మ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ధరణిలో ఏమైనా సమస్యలున్నాయా అని తాసిల్దార్ వీరభద్రప్పను అడిగి తెలుసుకున్నారు. తుంగభద్రానది పరీవాహక గ్రామాలు పుల్లూరు, మెన్నిపాడుల్లో ఇసుక అక్రమ రవాణా జరగకుం డా కఠినంగా చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ను ఆదేశించారు. అలాగే సీజ్ చేసిన ఇసుక డంపుల వద్ద, తుంగభద్రానది నుంచి ఇసుక రవాణా జరగకుండా వీఆర్ఏలకు డ్యూటీలు వేయాలని తాసిల్దార్కు సూచించారు.