రామగుండానికి మీరేం చేశారో చెప్పండి?
ఎమ్మెల్యే కోరుకంటి చందర్
కోల్సిటీ, మే 28: ఊరుకుంటున్నాం కదానీ… ఎక్కువ మాట్లాడుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. రామగుండానికి మెడికల్ కాలేజీ కావాలని తాను ఎంతో ప్రయత్నం చేశానని, చేస్తూనే ఉంటానని వివరించారు. ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నానో ప్రజలకు తెలుసని తెలిపారు. మెడికల్ కళాశాలలు మంజూరైతే జిల్లా కేంద్రాల్లోనే ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉందని వివరించారు.తాము సహనం కోల్పోయి వారి చిట్టాను బయట పెడితే ఈమాత్రం కూడా గోదావరిఖనిలో తిరిగేందుకు ముఖం చూపించలేని పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే చూసుకుంటూ ఊరుకోమని తేల్చి చెప్పారు. తాను గెలిచిన ఈ రెండున్నరేళ్లలోనే రామగుండానికి ఇది రాలేదు అది రాలేదంటూ ఎప్పుడో అమాస పున్నానికోసారి హైదరాబాద్ నుంచి వచ్చి విమర్శలు చేసి వెళ్లడం కాదని వివరించారు. ఏండ్ల తరబడి వారి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రామగుండానికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలని సవాల్ చేశారు. నూతన జిల్లాల ఏర్పాటు సమయంలో అప్పుడు అధికార పార్టీలో ఉన్న సదరు నాయకుడు రామగుండాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా తీసుకురాలేదని గుర్తు చేశారు. గోదావరిఖనిలోని జేఎన్టీయూ కళాశాలను మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు తన నియోజక వర్గానికి తీసుకెళ్తుంటే ఉలుకు పలుకు లేకుండా ఉన్నారని విమర్శించారు. కరోనా సమయంలో ప్రజల మధ్యకు వెళ్లి వారికి వైద్య సహాయం, ఆహారం అన్ని వసతులు సమకూరుస్తుంటే విమర్శించడం తగదన్నారు. రెండు రోజుల్లో మా కరోనా వారియర్స్ టీం సభ్యులను కూడా ప్రకటిస్తామని పేర్కొన్నారు.
మీరు కరోనా కంటే డేంజర్..
రామగుండం అభివృద్ధి విషయంలో మెదడులో పురుగు మెసిలినప్పుడల్లా ఏదో నిరసన ప్రదర్శనలు చేసి మళ్లీ ప్రజలకు కనబడకుండా పోయే మీరు కరోనా కంటే డేంజర్ అంటూ దుయ్యబట్టారు. విరామం లేకుండా తిరగడంతోనే తనకు కరోనా వచ్చిందని చెప్పారు. జాతీయ పార్టీ నాయకుడికి కరోనా ఎలా వచ్చిందో, ఎక్కడ వచ్చిందో చెబితే తల ఎత్తుకోలేరంటూ విమర్శించారు. నియోజక వర్గ ప్రజల క్షేమం కోసం దేవుడి దీక్షలు చేస్తుంటే వాటిని తప్పుపట్టేందుకు నోరు ఎలా వచ్చిందన్నారు. సమావేశంలో మేయర్ అనిల్కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కార్పొరేటర్లు జెట్టి జ్యోతి, కృష్ణవేణి, సాగంటి శంకర్, టీఆర్ఎస్ నాయకులు అడప శ్రీనివాస్, బొడ్డు రవీందర్, లక్ష్మణ్ గౌడ్ తదితరులున్నారు