ఖమ్మం సిటీ/ ఖమ్మం/ కొత్తగూడెం, మే 28: తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొవిడ్ నియంత్రణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రి అజయ్కుమార్ దిశానిర్దేశంలో ఖమ్మం కలెక్టర్ కర్ణన్ స్వీయ పర్యవేక్షణలో మహమ్మారిని అంతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా కరోనా వ్యాప్తి కారకులు (సూపర్ స్ప్రెడర్లు)గా గుర్తించిన వివిధ రంగాల వారికి శుక్రవారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాక్సినేషన్ ప్రక్రియ సూపర్ సక్సెస్ అయింది. ఖమ్మం జిల్లాలోని నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు, మరో 28 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో టీకా కోసం ఉదయం 8 గంటల నుంచే జనం బారులు తీరారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 18-44 ఏళ్ల వయసు కలిగిన ఎల్పీజీ డీలర్లు, వర్కర్లు, పెట్రోల్ బంకుల ఓనర్లు, వర్కర్లు 819, ఎఫ్సీఐ సిబ్బంది 215, జర్నలిస్టులు 472, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్లు 620, ఇతరులు 10 కలిపి మొత్తం 2,387 మందికి విజయవంతంగా టీకాలు వేశారు. అదేవిధంగా 45-60 ఏళ్ల మధ్య ఉన్న రేషన్ డీలర్లు 56, ఎల్పీజీ డీలర్లు, వర్కర్లు, పెట్రోల్ బంకుల వర్కర్లు 420, ఎఫ్సీఐ సిబ్బంది 116, జర్నలిస్టులు 209, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్లు 268, ఇతరులు 18 కలిపి మొత్తం 1,084 మందికి వ్యాక్సినేషన్ చేశారు. రెండు కేటగిరీలూ కలిపి 3,471 మందికి టీకా అందించారు.
పంచాయతీ శాఖ విస్తృత ఏర్పాట్లు..
కొవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ప్రజలతో నేరుగా సంబంధాలు ఉంటాయో వారిని గుర్తించి టీకాలు వేసే వినూత్న కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికిగాను జిల్లా వైద్యారోగ్యశాఖతోపాటు పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలను రంగంలోకి దింపింది. దీంతో ఖమ్మం జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు.
కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
ఖమ్మం జిల్లాలో 7,500 మంది సూపర్ స్ప్రెడర్లకు ఈ నెల 28, 29 తేదీల్లో వ్యాక్సినేషన్ కోసం 24 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో గుర్తించిన రేషన్ డీలర్లు, వర్కర్లు, ఎల్పీజీ డీలర్లు, వర్కర్లు, పెట్రోల్ బంక్ వర్కర్లు, జర్నలిస్టులు, ఫెర్టిలైజర్స్ డీలర్లకు కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు నగరంలో ఏర్పాటు చేసిన వ్యాక్నినేషన్ కేంద్రాలను శుక్రవారం ఆయన సందర్శించారు. లాక్డౌన్ వల్ల జిల్లాలో పాజిటివ్ రేటు తగ్గుముఖం పట్టిందని అన్నారు. కేఎంసీ కమిషనర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ మధుసూదన్రావు పాల్గొన్నారు.
భద్రాద్రిలో 387 మందికి సెకండ్ డోస్
భద్రాద్రి జిల్లాలో 2,062 మందికి తొలి రోజు టీకాలు వేశారు. ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించిన విలేకరులు కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇందులో భాగంగా రెండో డోసులో 387 మంది టీకా పొందారు. ఇక ఇప్పటికే రెండు రౌండ్లు పూర్తయిన ఇంటింటి సర్వే మూడో రౌండ్ కూడా కొనసాగుతుంది. గ్రామ పంచాయతీల్లో 700 బృందాలు 1,36,516 ఇళ్లకు వెళ్లి 3,481 కిట్లను అందజేశాయి. మున్సిపాలిటీల పరిధిలో 156 బృందాలు 25,569 ఇళ్లకు వెళ్లి 635 కిట్లను అందజేశాయి. దీంతోపాటు ఆసుపత్రుల్లో 44 కేంద్రాల్లో 23,528 కిట్లను అందించాయి. జిల్లాలో 4,310 యాక్టివ్ కేసులు ఉండగా వీరిలో 4,005 మంది కోలుకున్నారు. కొత్తగూడెం ఆసుపత్రిలో 150 మంది, భద్రాచలంలో 114 మంది, మణుగూరులో 23 మంది, ఇల్లెందులో 10 మంది, అశ్వారావుపేటలో 8 మంది చికిత్స పొందుతున్నారు.