యాదాద్రి, సెప్టెంబర్27: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో వైష్ణవాగమశాస్త్రరీతిలో యాదాద్రీశుడికి, శైవాగమ శాస్త్రరీతిలో శ్రీ పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి సోమవారం విశేష పూజలు జరిగాయి. ప్రభాతవేళలో గంటన్నర పాటు శివుడ్నికొలుస్తూ జరిగిన రుద్రాభిషేకంలో భక్తులు మమేకమయ్యారు. ఉదయాన్నే శివుడికి ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకించి శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన శివుడ్ని విభూతితో ఆలంకరణ చేశారు. శివాలయం ప్రధాన పురోహితులు ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ చేశారు. యాదాద్రీశుడి నిత్యపూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. బాలాలయంలో కవచమూర్తులను అభిషేకించి అర్చించిన అర్చక బృందం బాలాలయంలో శ్రీ సుదర్శననారసింహ హోమం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఆగమశాస్త్రరీతిలో జరిపించారు. బాలాలయంలో సాయంత్రం స్వామి, అమ్మవారికి వెండిజోడు సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల స్వామివారి నిత్య కైంకర్యాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంతో పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.