అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే నోముల భగత్
ఆకట్టుకున్న తొలి ప్రసంగం
హాలియా, సెప్టెంబర్ 27;“అధ్యక్షా! బడుగుల సర్కారుగా పేరున్న రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం ద్వారా యాదవుల సంపదను పెంచింది. పొరుగు రాష్ర్టాల నుంచి గొర్రెలు, పొట్టేళ్ల దిగుమతి 90 శాతం తగ్గింది. పెరిగిన జీవాల ఉత్పత్తికి తగ్గట్టు రెండు, మూడు మండలాలకు కలిపి మార్కెటింగ్ సౌకర్యాన్ని పరిశీలిస్తే బాగుంటుంది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన మీట్ ప్రాసెసింగ్ యూనిట్, ప్రాంతాల వారీగా మొబైల్ మీట్ అవుట్ లెట్లను ఏర్పాటుచేస్తే జీవనోపాధిని మరింత పెంచే వీలుంది. వెటర్నరీ ఆస్పత్రులు, డాక్టర్ల సంఖ్యను పెంచాల్సిందిగా కోరుతున్నాను.”
హాలియా, సెప్టెంబర్ 27 : 2017లో ప్రభుత్వం ప్రారంభించిన సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అద్భుతమని, రెండు, మూడు మండలాలకు కలిపి ఒక గొర్కెల మార్కెటింగ్ వ్యవస్థతోపాటు ప్రజలకు నాణ్యమైన మాంసం అందించేందుకు మొబైల్ మీట్ అవుట్లెట్ల ఏర్పాటును పరిశీలించాలని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. పెరిగిన గొర్రెల సంఖ్యకు తగ్గట్టుగా పశువైద్యశాలలను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. భగత్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. తన తండ్రి నోముల నర్సింహయ్య ఎలా చలోక్తులతో ప్రసంగించారో అలానే అధ్యక్షా అంటూ సంబోధిస్తూ ఓ సామెతను ప్రస్తావించారు. చైనాలో ఒక చిన్న సామెత ఉంది అధ్యక్షా.. చేపలు పట్టి ఇస్తే అది ఆ రోజే వాడి కడుపు నింపుతది. కానీ వాడికి చేపలను పట్టడం నేర్పిస్తే వాడు జీవితాంతం బాగుపడి వాడు మంచిగా అభివృద్ధి చెందుతడు అని.. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అలాగే ఆచరణలో పెట్టారని పేర్కొన్నారు. మొదటిసారిగా అసెంబ్లీలో భగత్ మాట్లాడుతుండగా నియోజకవర్గ ప్రజలు టీవీల్లో ఆసక్తిగా తిలకించారు.
నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో నోముల భగత్ తొలి ప్రసంగమిది. ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్సిడీపై అందిస్తున్న గొర్రెల పంపిణీ గొల్ల, కురుమల ఆర్థిక పురోభివృద్ధికి ఎలా దోహదపడిందో వివరిస్తూ ధన్యవాదాలు తెలుపడంతోపాటు.. పెరిగిన జీవాల సంఖ్యకు తగ్గట్టు అవసరమైన ప్రతిపాదనలు సభ వేదికగా మంత్రి తలసాని దృష్టికి తీసుకెళ్లారు.