జిల్లాలో వరిధాన్యంతో రూ.350 కోట్ల ఆదాయం
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరం
విలేకరుల సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ అర్బన్, జూన్ 27 : సదర్మాట్ ప్రాజెక్టు నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించిన భూములకు మూడు నెలల్లోనే పరిహారం అందిస్తామని రైతులకు మాట ఇచ్చామని, ఈ ప్రకారం రెండుమూడు రోజుల్లో పరిహారం అందిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని శాస్త్రినగర్ కాలనీలోని తన నివాసంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదర్శనగర్, కొత్తూరు, టెంబుర్ని, పొన్కల్, కమల్కోట్ గ్రామాల రైతులకు రెండు మూడు రోజుల్లోనే పరిహారం అందిస్తామని చెప్పారు. మొత్తం రూ.46 కోట్ల వరకు పెండింగ్ ఉండేవని, ఇదివరకే రూ.8.50 కోట్లు పీడీ ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు. ఇటీవల మంత్రి హరీశ్రావు, ఆర్థిక శాఖ కార్యదర్శిని కలువడంతో ఈ నెల 26న రూ.30 కోట్లను రిలీజ్ చేశారని చెప్పారు. మొత్తం రూ.38.50 కోట్లను ఐదు గ్రామాల రైతులకు త్వరలోనే అందిస్తామన్నారు. కొవిడ్ కారణంగా ప్రభుత్వానికి లక్షకోట్ల ఆదాయం తగ్గిందని, అందువల్ల పరిహారం అందించడంలో జాప్యం తలెత్తిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నదని, సంక్షేమ పథకాలతో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. నిర్మల్ జిల్లాలో 1.80 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండిందని, జిల్లా రైతుల ఖాతాల్లో రూ.350 కోట్లు జమయ్యాయని పేర్కొన్నారు.
27 ప్యాకేజీతో రూ.300 కోట్లతో నూతనంగా పనులను ప్రారంభించుకున్నామని, వచ్చే రెండేళ్లలో 50 వేల ఎకరాలకు సాగు నీరు అందనుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. రైతులు నూతన సాగు విధానాలను అవలంబించి పంటలను సాగు చేయాలని, దీంతో దిగుబడి పెరుగుతుందని తెలిపారు. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నదని, పీడీ యాక్టు నమోదు చేస్తున్నదన్నారు. రూ.3.5 కోట్లతో చించోలి వద్ద ఐదు ఎకరాల స్థలంలో ఆర్టీవో కార్యాలయం నిర్మిస్తున్నామని, అన్ని సౌకర్యాలతో వాహనదారులకు ట్రాక్ నిర్మాణం చేస్తున్నామన్నారు. దేవాదాయ శాఖ ద్వారా జిల్లాలో దాదాపు రూ.60 కోట్లతో 600 ఆలయాలను నిర్మించుకున్నామని తెలిపారు. హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. హరితహారం కార్యక్రమం ద్వారా విరివిగా మొక్కలు నాటి 33 శాతం అడవులను పెంచాలన్నారు. జిల్లాలో నూతన కలెక్టరేట్ భవనాల నిర్మాణం 60 శాతం పూర్తయిందని తెలిపారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణ గౌడ్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ప్రముఖ వ్యాపార వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు.