పరిగి, డిసెంబర్ 26 : వికారాబాద్ జిల్లా ఎస్పీగా ఎన్.కోటిరెడ్డి ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా పని చేస్తున్న కోటిరెడ్డి వికారాబాద్ జిల్లా ఎస్పీగా బదిలీపై వచ్చారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజలు శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అంతకుముందు కుటుంబసభ్యులతో కలిసి అనంతగిరి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. ఎస్పీ కోటిరెడ్డికి అడిషనల్ ఎస్పీ రషీద్, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.