తుర్కయాంజాల్, నవంబర్ 27 : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా మున్సిపాలిటీ పరిధి మునగనూర్ 1వ వార్డులోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ బాలికల వసతి గృహంలో ప్లాస్టిక్, తడి, పొడి చెత్తపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కమిషనర్ మాట్లాడుతూ భూకాలుష్యంతో వాతావరణ సమస్యలు తలెత్తుతాయన్నారు. మున్సిపాలిటీలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొదట విద్యార్థులు చైతన్యమైతే వారు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారన్నారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు, చెత్త వేస్తే జరిమానా విధిస్తున్నామన్నారు. సదస్సులో కౌన్సిలర్ సంగీత, పాఠశాల హెచ్ఎం జానకిరాములు, మేనేజర్ జంగయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ హరీశ్, బిల్ కలెక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్పై విద్యార్థులకు అవగాహన
ఆమనగల్లు, నవంబర్ 27 : పట్టణ పరిశుభ్రత అందరి కర్తవ్యంగా భావించాలని కౌన్సిలర్ లక్ష్మణ్ అన్నారు. శనివారం మున్సిపాలిటీలో స్వచ్ఛ సర్వేక్షణ్పై పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు కమిషనర్ శ్యామ్సుందర్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రాధాన్యత, తడి, పొడి చెత్త, అంటువ్యాధుల ప్రభావం, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులతో స్వచ్ఛ సర్వేక్షణ్పై మున్సిపాలిటీ కమిషనర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.