నిర్దేశించిన లక్ష్యాన్ని కచ్చితంగా పూర్తి చేయాలి..
జీపీలకు విడుదలైన నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలి..
ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పంపిణీ చేయాలి..
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలి
కలెక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
నిర్మల్ టౌన్/ఎదులాపురం, జూన్ 26 : రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జూలై 1 నుంచి పట్టణ, పల్లె ప్రగతితో పాటు హరితహారం కార్యక్రమాలను చేపట్టాలని, నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రగతి పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లాల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె, పట్టణాల అభివృద్ధే లక్ష్యంగా ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నదని తెలిపారు. వచ్చిన నిధులతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టాలని సూచించారు. ఇప్పటివరకు ఆయా జిల్లాల్లో పల్లె, పట్టణ ప్రగతి ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పూర్తయిన అభివృద్ధి పనులు, పెండింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ల ద్వారా ప్రగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూలై ఒకటో తేదీ నుంచి హరితహార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేసి, వాటిని పెంచే బాధ్యతను ప్రజలకు అప్పగించాలని తెలిపారు. ఇప్పటివరకు హరితహారంలో నాటిన మొక్కలు, సంరక్షించిన మొక్కలు, అడవుల వృద్ధి రేటు, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయని గుర్తు చేశారు. రైతులు పండించిన ధాన్యం నిల్వలకు గోదాములు, రైస్మిల్లులను నిర్మించుకోవాలని సూచించారు. ఆయా జిల్లాల్లో రైతులు సాగు చేసే పంటల ఆధారంగా స్థానికంగానే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు నాణ్యతగా చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు ముషారఫ్ అలీ ఫారూఖీ, సిక్తా పట్నాయక్,భారతీ హోళికేరి, రాహుల్రాజ్, స్థానిక సంస్థల కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీపీవో వెంకటేశ్వర్రావు, డీఆర్డీవో సుధీర్కుమార్ పాల్గొన్నారు.