నియోజకవర్గవ్యాప్తంగా రోడ్లకు 11.92 కోట్లు మంజూరు
ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి
నారాయణపేట, జనవరి 26: నారాయణపేట నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులకు రూ.11.92 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లకు మరమ్మతులు చేయనున్నట్లు తెలిపారు. వరదలు, వర్షాలు తదితర కారణాలతో దెబ్బతిన్న నారాయణపేట పంచాయతీరాజ్ రోడ్లను మరమ్మతు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దృష్టికి తీసుకెళ్లగా పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానీయా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ నిధుల ద్వారా పేట నియోజకవర్గంలోని దామరగిద్ద, నారాయణపేట, ధన్వాడ, మరికల్, కోయిల్కొండ మండలాల పరిధిలోని పంచాయతీరాజ్ రోడ్లను మరమ్మతు చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలోనే వీటికి టెండర్లు పూర్తయి పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పట్టణానికి చెందిన సావిత్రమ్మకు రూ.1,25,000, సత్యమ్మకు రూ.16,000 విలువ గల చెక్కులను అందజేశారు. రెడ్క్రాస్ ఆధ్వర్యంలో మాస్కులను పంపిణీ చేశారు.