దారులన్నీ హైటెక్స్ వైపే..
జెండాలను చేతబూని
భారీ ర్యాలీతో తరలివెళ్లిన నేతలు
ఉమ్మడి జిల్లా నుంచి 600 మంది
ప్రజాప్రతినిధులు హాజరు
టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం.. ప్లీనరీ విజయవంతంపై నేతల సంతృప్తి
సూర్యాపేట, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్లోని హైటెక్స్లో సోమవారం టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్లీనరీ సూపర్ సక్సెస్ అయ్యింది. పార్టీ స్థాపించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ప్లీనరీ చరిత్రలో నిలిచిపోయేలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పార్టీ ప్రజాప్రతినిధులు భారీగా తరలివెళ్లారు. మంత్రి జగదీశ్రెడ్డితోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ప్రతినిధులతోపాటు 600 మంది వెళ్లారు. పార్టీ జెండాను చేతబూని భారీ ర్యాలీతో అన్ని మండలాల నుంచి నేతలు గులాబీ దుస్తులు ధరించి వెళ్లారు. ప్లీనరీ విజయవంతంపై నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తుండగా..కనీవిని ఎరుగని రీతిలో జరిగిన కార్యక్రమంపై టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఇరవై ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్తానంలో ఉద్యమం, అధికారపక్షంలో ఉండి అనుభవించిన పరాభవాలు, విజయాలు, ఆనందాలను పంచుకున్న ప్లీనరీ ఎంతో ఉత్సాహాన్ని నింపిందని ప్లీనరీకి హాజరైన ప్రతినిధులు తెలిపారు. ప్లీనరీకి ఉమ్మడి జిల్లా నుంచి 600మంది ప్రజాప్రతినిధులు, ఇటీవల నియామకమైన సంస్థాగత కమిటీల ప్రతినిధులు తరలివెళ్లారు. టీఆర్ఎస్ పార్టీ తొలి పద్నాలుగేళ్లు చేపట్టిన ఉద్యమం, తదనంతరం ఎన్నికల్లో విజయం సాధించి ఏడున్నరేండ్ల అధికారంలో చేపట్టిన విజయాలను సీఎం కేసీఆర్ సవివరంగా వివరించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై మంత్రులు చేసిన తీర్మానాలతోపాటు దళిత బంధు కేవలం దళితులకే కాదని, అన్నివర్గాలకు బంధువేనని, అన్నికులాల వారు ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు కచ్చితంగా డబ్బులిచ్చి తీరుతానని ముఖ్యమంత్రి చెప్పారు. దీంతో వచ్చే రెండేండ్లలో జరుగనున్న ఎన్నికల కోసం పార్టీని మరింత బలోపేతం చేసే సంకల్పం నెరవేరినట్లేనని ప్లీనరీకి వెళ్లినవారు గర్వంగా చెబుతున్నారు. 20 ఏండ్ల టీఆర్ఎస్ ఉత్సవాల్లో భాగంగా నవంబర్ 15న వరంగల్లో నిర్వహించతలపెట్టిన విజయగర్జన సభతో ప్రతిపక్షాల్లో వణుకు పుట్టడం ఖాయమంటున్నారు.
ఆకాశం ఎత్తులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు ఉంటే.. మోకాళ్ల ఎత్తులో విపక్షాల ఆలోచనలు ఉంటున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎద్దేవా చేశారు. సోమవారం హైదరాబాద్లోని హైటెక్స్లో ‘పరిపాలనా సంస్కరణలు-విద్యుత్, పారిశ్రామిక, ఐటీ రంగాల అభివృద్ధి-మౌలిక వసతుల కల్పన’పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపర్చి మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన ముఖ్యమంత్రి కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని స్పష్టం చేశారు. విద్యుత్ వినియోగంలో రాష్ట్రం దేశంతో పోల్చిచూస్తే 73శాతం ముందుందన్నారు. రాష్ట్రం ఆవిర్భవించే నాటికి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,700 మెగావాట్లు ఉండగా, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో ప్రస్తుతం 16,500 మెగావాట్లకు పెరిగిందన్నారు. అలాగే రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి కేవలం 70మెగావాట్ల ఉత్పత్తికే పరిమితమైన సోలార్ విద్యుత్ ఉత్పత్తి నేడు 4 వేల మెగావాట్లకు చేరిందంటే ఈ ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్దే అని పేర్కొన్నారు. యావత్ భారతదేశంలోనే ఇంటింటికీ సురక్షితమైన తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24గంటల నిరంతర నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ ఒక్కటే అన్నారు. దేశంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అక్షరాన్ని అమలుపర్చిన ఘనత టీఆర్ఎస్కే దక్కిందన్నారు. వలసల జిల్లాగా పేరుపొందిన పాలమూరు.. ఇప్పుడు 20లక్షల పైచిలుకు వలస కా ర్మికులకు ఆతిథ్యం ఇస్తుందన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు బీజేపీ, కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు అమలు కావడం లేదంటూ ఆయన విపక్షాలను ప్రశ్నించారు. మహారాష్ట్రకు చెందిన ప్రజాప్రతినిధులు ఆ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని, మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో కలపండి లేదా అక్కడ పెట్టిన పథకాలు ఇక్కడ అమలుచేయమని చేస్తున్న డిమాండ్ ఇక్కడి కాంగ్రెస్ నేతల చెవికి ఎక్కడం లేదని విమర్శించారు.