యాదాద్రి, డిసెంబర్ 25 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తులు కిటకిటలాడారు. వరుస సెలవులు రావడంతో ఇలవేల్పును దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులతోపాటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో కొండపైకి వాహనాలను అనుమతించలేదు. కొండ కింద స్వామివారి పాదాల నుంచి పాతగోశాల వద్ద గల పార్కింగ్కు వాహనాలను మళ్లించారు. శనివారం ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్వామివారి బాలాలయంలో తిరుప్పావై వేడుకలు నిర్వహించారు. వేదమంత్రాలను పటిస్తూ గోదాదేవి శ్రీరంగనాయకుడిపై రచించిన పాశురాల్లో తొమ్మిదో పాశురాన్ని పఠిస్తూ భక్తులకు వినిపించారు. వేకువజామున స్వయంభువులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించారు. తులసీ అర్చనలు జరిపారు. అనంతరం లక్ష్మీనరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి సుదర్శన హోమం, లక్ష్మీనరసింహుల కల్యాణం, అలంకార సేవోత్సవాలతోపాటు అష్టోత్తరం జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు.
నిత్యారాధనలు..
కొండపైన గల శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. శ్రీవారి ఖజానాకు శనివారం రూ. 23,13,141 ఆదా యం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.