ప్రజాదరణ ఉన్న పార్టీని ఎదుర్కోలేక దిగజారుడు తనం
విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్న నేతలు
కుటుంబసభ్యులను టార్గెట్ చేస్తూ చీప్ పాలి‘ట్రిక్స్’
సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర పోస్టులు
ఛీదరించుకుంటున్న ప్రజలు
బీజేపీ నాయకుడు చింతపండు నవీన్ చిల్లర పనిపై రాజకీయాలకు అతీతంగా ఆగ్రహావేశాలు
వరంగల్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాజకీయాల్లో విమర్శలంటే పదిమంది ఆలోచించేలా ఉండాలి.. విషం కాకుండా విషయంలో నిజం, నిజాయితీ ఉండాలి.. వ్యక్తిగతంపై కాకుండా.. రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న తీరుపై ఉండాలి.. మాటల్లో సంస్కారం ఉండాలి.. కానీ, ఇక్కడ ఆదరణ ఉన్న టీఆర్ఎస్ పార్టీని నేరుగా ఎదుర్కోలేక గల్లీ బీజేపీ నేతలు రోత రాజకీయాలు చేస్తున్నారు. అబద్ధపు ప్రచారాలు చేయడమే కాదు.. ఏ విధంగానైనా సరే అధికారంలోకి రావాలన్న దుర్బుద్ధితో ప్రజాప్రతినిధులను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు.. అదీచాలక ఏకంగా కుటుంబసభ్యులను కూడా టార్గెట్ చేస్తున్నరు. అసలు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని పిల్లలను కూడా బయటకు లాగుతూ మానసికంగా ఇబ్బందులు పెడుతున్నరు. జర్నలిస్టునని చెప్పుకొనే.. బీజేపీ ముసుగు తొడుక్కున్న చింతపండు నవీన్ సోషల్ మీడియా వేదికగా పోల్ పేరిట మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు శరీరాన్ని కించపరిచేలా చేసిన పోస్టుపై పలు పార్టీ నేతలు, రాజకీయ నిపుణులు, ప్రజలు భగ్గుమంటున్నారు. భావప్రకటనా స్వేచ్ఛనే ప్రశ్నార్థకం చేస్తున్న తీరును రాజకీయాలకు అతీతంగా ఖండిస్తున్నారు.
బీజేపీ లీడర్లు ఇప్పుడు ద్వేషమే ఎజెండాగా రాజకీయాలు చేస్తున్నారు. దీన్నే కొత్త ట్రెండ్గా మార్చారు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దుష్ప్రచారాలు చేయిస్తున్నారు. ఇంకా హద్దులు దాటి బూతులు కూడా తిట్టిస్తున్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులపై వ్యక్తిగత విమర్శలు చేయడమే కాకుండా ఇప్పుడు ఏకంగా కుటుబంసభ్యులను కూడా వివాదాల్లోకి లాగే ప్రయత్నాలు చేస్తుండగా ఇలాంటి నీచరాజకీయాలపై ప్రజలు భగ్గుమంటున్నారు. వ్యక్తిగత విమర్శలు, దిగజారుడు విమర్శలు సరికాదని మండిపడుతున్నారు. రాజకీయాల్లో అంశాల వారీగా భిన్నాభిప్రాయాలు, వాదాలు, భేదాలు, చర్చలు ఉంటాయిగానీ ఇప్పుడు అధికారకాంక్షతో బీజేపీ నాయకులు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై చర్చించాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలకు దిగుతూ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సభ్యులపై ఇటీవలే బీజేపీలో చేరిన.. జర్నలిస్టును అని చెప్పుకునే చింతపండు నవీన్ సోషల్ మీడియా వేదికగా చేసిన చిల్లర పనిపై రాజకీయాలకు అతీతంగా భగ్గుమంటున్నారు. అతడు యూట్యూబ్ చానల్ పేరిట వాడుతున్న భాష కూడా జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమైనదని, జర్నలిస్టునంటూ పత్రికా స్వేచ్ఛపేరిట వాడుతున్న భాషను రాజకీయ విధానాలపైనే కాకుండా కుటుంబసభ్యులపై కూడా వాడి వారిని వివాదాల్లోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఇది దుర్మార్గమైన చర్య అని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి చర్యలను రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరూ ఖండించాలని కోరుతున్నారు. బీజేపీ నేతలు ఒకరికొకరు పోటీపడి చేస్తున్న వ్యక్తిగత విమర్శల స్ఫూర్తితోనే ఇప్పుడు కొత్తగా ఆ పార్టీలో చేరిన వారు మరింత దిగజారుతున్నారని విమర్శిస్తున్నారు. రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులపై, అదీ స్కూలుకు వెళ్లే పిల్లలపై విమర్శలు చేయడం గతంలో ఎప్పుడూ లేదని బీజేపీలోనే ఆ దరిద్రం ఇప్పుడు కనిపిస్తున్నదని అసహ్యించుకుంటున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను విమర్శిస్తే అందరు గుర్తిస్తారనే వ్యక్తిగత స్వార్థంతో ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారని దుయ్యబడుతున్నారు.
విమర్శ హుందాగా ఉండాలి
రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. కుటుంబ సభ్యులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రభుత్వాలపై, రాజకీయ పార్టీలపై విమర్శలు హుందాతనంతో కూడినవిగా ఉం డాలి. ప్రచార ఆర్భాటం కోసం, తొందరపాటు చర్యల వల్ల అనవసరంగా గందరగోళ పరిస్థితులు సృష్టించవద్దు. ప్రెస్ మీట్లో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రత్యర్థులను ముఖాముఖి ఎ దుర్కోవాలి తప్ప రాజకీయాల్లో లేని చిన్న పిల్లలను, కుటుంబ సభ్యులపై విమర్శలు చేయడం మంచిది కాదు. ఇది ముమ్మాటికి తప్పే అవుతుంది.
తీన్మార్ మల్లన్న తీరు మార్చుకోవాలి
తీన్మార్ మల్లన్న తీరు మార్చుకోవాలి. పనిగట్టుకొని ఒకే కుటుంబాన్ని, ఒకరినే విమర్శించడం తగదు. ఇతర పార్టీల్లోని తప్పులు, లోపాలుంటే ఎత్తిచూపాలి. అప్పుడే ఆయన చేసిన ప్రచారాలను, విమర్శలను ప్రజలు నమ్ముతారు. రాష్ట్రం లో మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ కుమారుడిపై కించపరిచేలా ట్విట్టర్లో అభ్యంతరకర పోస్టు పెట్టడం తప్పు. ఇలా రాజకీయాల్లోకి పిల్లలను లాగి విమర్శలు చేసే వారిని చట్టపరంగా శిక్షించాలి. రాజకీయంగా ఎదుర్కొవడం చేతగాకనే ఇలాంటి విమర్శలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. తీన్మార్ మల్లన్న మీద దాడి జరిగిందని కొందరు ఆయన ఫాలోవర్స్ నెట్టింట్లో గగ్గోళు పెడుతున్నారు. వారికి నా సూటి ప్రశ్న ఒకటే. మల్లన్నను వెనుకేసుకొని వచ్చే వారి ఇంట్లో వారిని మల్లన్న విమర్శిస్తే ఊరుకుంటారా? ఇది వారి విజ్ఞతకే వదిలివేస్తున్నా.
ఇంత దిగజారుడుతనమా?
జర్నలిజాన్ని అపహస్యం చేస్తూ తీన్మార్ మల్లన్న నీచాతినీచంగా వ్యవహరిస్తున్నాడు. ఎంతోకాలంగా కేసీఆర్ కుటుంబాన్నే టార్గెట్ చేస్తూ ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నాడు. అంతటితో ఆగకుండా బీజేపీలో చేరిన తర్వాత వ్యక్తిగత ప్రచారం కోసం చిన్న పిల్లలను అవమానపరుస్తున్నాడు. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారేలా ప్రవరిస్తున్న తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాజకీయ ప్రత్యర్థుల మీద, వాళ్ల కుటుంబ సభ్యుల మీద విషప్రచారం చేసే ముందు తమ ఇంట్లో ఉన్న వారిని కూడా గుర్తు చేసుకోవాలి. సహనానికీ ఓ హద్దు ఉంటుంది. అంతవరకు తెచ్చుకోవద్దు.
బీజేపీకి అమ్ముడువోయిండు..సోషల్ మీడియాలో అభ్యంతర
రీతిలో పోస్టులు పెట్టడం, స్థాయిని మించి విమర్శలు చేయడమే తీన్మార్ మల్లన్న సంస్కారం. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షును టార్గెట్ చేస్తూ ఆయన పోస్టు చేయడం సిగ్గుచేటు. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.. ఇప్పటికైనా బ్లాక్మెయిల్ రాజకీయాలు బంద్ జేయ్. ఇదివరకు నేను తీన్మార్ మల్లన్న టీమ్ల పనిచేసిన. ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందేలా చూడాలంటూ మాయమాటలు చెప్పేవాడు. ఆయన టీంలలో కూడా వర్గపోరులున్నాయి. అంతా బ్లాక్మెయిల్ రాజకీయమే. ఇప్పుడు బీజేపీకి అమ్ముడువోయిండు.