కొత్తపల్లి, డిసెంబర్ 25: మేధోశక్తిని పెంపొందించడంలో చెస్ ఎంతగానో దోహదం చేస్తున్నదని, గతంలో కంటే ఈ ఆటకు విద్యార్థుల నుంచి విశేష ఆదరణ రావడం అభినందనీయమని నగర మేయర్ వై.సునీల్రావు పేర్కొన్నారు. జీనియస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న చదరంగ పోటీలను అకాడమీ డైరెక్టర్లు కంకటి కనకయ్య, కంకటి అనూప్కుమార్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. చదరంగ పోటీలు బాలబాలికల్లో విజ్ఞానాన్ని పెంచుతాయన్నారు. మిగతా క్రీడలన్నీ శారీరక దారుఢ్యానికి సంబంధించినవైతే చెస్ విజ్ఞానానికి సంబంధించినదని పేర్కొన్నారు. మెదడుకు పదును పెట్టి ఆలోచిస్తేనే విజయం సాధించే ఆస్కారముంటుందని చెప్పారు. పిల్లల్లో తెలివితేటలు పెరిగి భవిష్యత్లో మానసికి ఒత్తిడిని తట్టుకొనే శక్తి వస్తుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదరంగం వైపు ప్రోత్సహించాలని సూచించారు. రాబోయే రోజుల్లో కరీంనగర్లో రాష్ట్రస్థాయి చదరంగం పోటీలను నిర్వహించాలని, ఇందుకు కార్పొరేషన్ తరఫున సహకారం అందిస్తామని చెప్పారు. సుమా రు 150మంది బాలబాలికలు హాజరు కాగా, అండర్-7 నుంచి 15 వరకు పోటీలను నిర్వహిస్తున్నారు. టాప్-10 విజేతలకు రూ.11వేల నగదు బహుమతులను అందజేయనున్నట్లు పోటీల నిర్వాహకులు తెలిపారు. వాగేశ్వరి డిగ్రీ కళాశాల చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, జిల్లా చదరంగ సమాఖ్య అధ్యక్షుడు మోసం అంజయ్య, సీనియర్ క్రీడాకారుడు కుమార్, ఆర్బిటర్స్ అనిల్, జగన్, రఘురామన్, మధు, తరుణ్, కిరణ్ తదితరులున్నారు.