7వ విడుత తెలంగాణకు హరిత హారం పోస్టర్ ఆవిష్కరణ
పెద్దపల్లి జంక్షన్, జూన్ 25: ఏడో విడుత హరితహారం నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఇప్పటికే మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వే ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. లక్ష్యం మేరకు నర్సరీల్లో మొక్కలను పెంచారు. పండ్లు, కలప, నీడ, అలంకరణ, పువ్వులనిచ్చే మొక్కలను నాటనున్నారు. 7వ విడుత తెలంగాణకు హరిత హారానికి సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం ముద్రించిన పోస్టర్లను కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ, తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 7వ విడుత హరిత హార జిల్లా లక్ష్యం 43, 71, 650 అని వెల్లడించారు. గ్రామీణాభివృద్ధి, అటవీ, పురపాలక, పరిశ్రమల శాఖలు, సింగరేణి, ఎన్టీపీసీ సంస్థల ఆధ్వర్యంలో మొ క్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించామని వివరించారు. ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యం మేరకు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వీ లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్, డీఎఫ్వో రవిప్రసాద్, డీఆర్డీవో శ్రీధర్, డీపీవో చంద్రమౌళి పాల్గొన్నారు.