లొంగిపోతే మానవత్వంతో సహకరిస్తాం..
ప్రభుత్వం నుంచి ఆదుకుంటాం
మావోయిస్ట్ ఇర్రి మోహన్ రెడ్డి తల్లి నర్సవ్వను కోరిన నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్కుమార్
నిర్మల్ అర్బన్, జూన్ 25 : అమ్మా నీ కొడుకును.. అజ్ఞాతం వీడమనండి.. మానవత్వంతో సహకరిస్తామని మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు ఇర్రి మోహన్ రెడ్డి తల్లి నర్సవ్వను నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ కోరారు. సోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూచన్పెల్లికి చెందిన ఇర్రి మోహన్ రెడ్డి అలియాస్ సురేందర్, భాస్కర్, ఉమేశ్, విజయ్, ప్రకాశ్ చౌదరి మావోయిస్టు రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నాడు. ఆయన తల్లి నర్సవ్వ (80) పట్టణంలోని దివ్యానగర్లో ఉంటుండగా ఇన్చార్జి ఎస్పీ శుక్రవారం ఆమె ఇంటికి వెళ్లి మాట్లాడారు. ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జనజీవన స్రవంతిలోకి వస్తేనే ఆనందజీవితాన్ని గడపవచ్చ న్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేలా వారి కుటుంబ సభ్యులు కోరాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మావోయిస్టులు వారి సిద్ధాంతాల ద్వారా సాధించేది ఏమీ లేదన్నారు.అడవిని వీడి జనంలోకి వస్తే మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. కరోనా బారిన పడి అనవసరంగా ప్రాణాలు కోల్పోవద్దని సూచించారు. గతంలో లొంగిపోయిన మావోయిస్టుల మాదిరిగా మిగతా వాళ్లు లొంగిపోతే వారిపై ఉన్న రివార్డులు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అన్ని సదుపాయాలు అందజేయడానికి పోలీస్ శాఖ తరపున తాము ముందుంటామని స్పష్టం చేశారు. నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ రమేశ్, సోన్ సీఐ జీవన్ రెడ్డి, టౌన్ సీఐ శ్రీనివాస్ ఉన్నారు.