నిర్భయంగా.. స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, సిద్దిపేట అదనపు కలెక్టర్
ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం
ఆయా కలెక్టరేట్లలో అధికారులతో ప్రతిజ్ఞ
సంగారెడ్డి కలెక్టరేట్/సిద్దిపేట అర్బన్, జనవరి 25 : ఓటే భవిష్యత్ అని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా, స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం హనుమంతరావు, సిద్దిపేట అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ పిలుపునిచ్చారు. మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా జిల్లాల కలెక్టరేట్లలో ఘనంగా నిర్వహించారు. అధికారులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిపాలన వ్యవస్థలో ఓటర్లదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. ఓటర్లు ఎలాంటి ప్రభావాలకు లొంగకుండా తమ ఓటు హక్కును నిర్భయంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు. ప్రతి సంవత్సరం ఓటరు జాబితా సవరణ కార్యక్రమం జరుగుతుందని, 18ఏండ్లు నిండిన యువత ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు. నూతన ఓటర్లు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకున్ని ఎన్నుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాధికా రమణి, ఎన్నికల విభాగం అధికారి పాషా, సిబ్బందు తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు నుంచే అందరికీ ఓటు హక్కు..
ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన తొలి రోజు నుంచే 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించిన దే శంగా భారత్ రికార్డ్ తిరుగులేనిదని సిద్దిపేట అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ అన్నారు. ప్రపంచంలో 400 ఏండ్ల క్రితమే ప్రజాస్వామ్య పాలన సాగిస్తున్న అమెరికా, ఇంగ్లాం డ్ వంటి దేశాలున్నాయని, అయినా, ప్రజాస్వామ్య దేశాల్లో భారత్కు ఒక ప్రత్యేకత ఉందన్నారు. ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన మొదటి రోజు నుంచే డబ్బు, కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించిన దేశంగా భారత్కు ప్రపంచంలో తిరుగులేని రికార్డు ఉందన్నారు. ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన 350ఏండ్ల తర్వాత 1967లో అమెరికా మహిళకు పురుషులతో సమానంగా ఓటు హక్కు కల్పించిందన్నారు. కానీ, భారత్ అమెరికా కన్నా 20ఏండ్ల ముందే మహిళలకు ఓటు హక్కు కల్పించిందన్నారు. జిల్లాలో 3 వేలకు పైగా కొత్తగా నమోదైన ఓటర్లు ఉన్నారని, వారికి బుక్లెట్ ఇస్తామన్నారు. ఓటర్లందరూ ఆలోచించి రాష్ర్టాన్ని, దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపే అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించుకోవాలని సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో సమానంగా ఈవీఎంలతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నదన్నారు. సులభతర ఓటింగ్ నమోదు ప్రక్రియ మన ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. ఓటు వేయడం ఒక హక్కు లాగా అనుకొని, అది ఒక సేవ, బాధ్యతగా ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. అనంతరం కలెక్టరేట్ సిబ్బంది, అక్కడున్న వారితో అదనపు కలెక్టర్లు ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిక్షణ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి బీ చెన్నయ్య, హుస్నాబాద్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.