దశలవారీగా ఎస్టీ, బీసీ, అగ్రవర్ణాల్లో పేదలకు సైతం వర్తింపు
ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
మహబూబ్నగర్, జనవరి 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళితులను కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే చూశారని, అధికారంలోకి వచ్చేందుకు వారి ఓట్లను మాత్రమే వినియోగించుకున్నారని ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. సామాజికంగా అత్యంత వెనుకబడిన దళితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపే దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నారు. మహబూబ్నగర్ జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో దళితబంధుపై మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. దళితులను నేరుగా ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. దశలవారీగా ఎస్టీ, బీసీ, అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం దళితబంధు తరహా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుందన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన దళితబంధు అమలులో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. పథకం విజయవంతంగా అమలు చేసేందుకు అధికారులంతా సహకరించాలన్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులకు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఇతర పరిశ్రమలతో పాటు ఇతర రంగాల్లో డిమాండ్ ఉన్న యూనిట్లను గుర్తించి లబ్ధిదారులకు లాభం చేకూర్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా అమలు చేసే యూనిట్లపై నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా వరి నాటే యంత్రాలు, సెంట్రింగ్, ఎరువులు, విత్తనాల దుకాణాలు వంటి యూనిట్లు గుర్తించాలన్నారు. ఆయా ప్రాంతాల్లో యూనిట్లను గుర్తించి బుధవారంలోగా నివేదికలు సమర్పించాలన్నారు. దళితబంధు పథకం శాశ్వతంగా ఉండిపోతుందని అధికారులు సైతం ఆ స్థాయిలో ఈ పథకంపై పనిచేయాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నరేందర్రెడ్డి, అంజయ్యయాదవ్, జెడ్పీ చైర్ పర్సన్లు స్వర్ణ సుధాకర్రెడ్డి, వనజ, కలెక్టర్లు ఎస్. వెంకట్రావు, దాసరి హరిచందన, జెడ్పీ సీఈవో జ్యోతి, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దళితబంధు అద్భుత పథకం
దళితబంధు పథకం దేశంలోనే గొప్ప పథకం. ప్రతి ఒక్కరికీ లాభం వచ్చేలా చేయాలని, పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలి. ఆవు పాలు, స్థానికంగా లభించే మంచినూనెకు డిమాండ్ ఏర్పడుతుంది. ఇలాంటి రంగాలను దళితబంధు పథకం ద్వారా లబ్ధిదారులకు అమలయ్యేలా చూడాలి. దళితులకు లాభం జరగడమే కాకుండా యూనిట్ల ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆహారం లభిస్తుంది.