గర్భం దాల్చిన 12 వారాల్లోనే మొదటి ఏఎన్సీ నమోదు కావాలి
అడిగిన ప్రతి ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలి
నాగర్కర్నూల్, వనపర్తి అధికారుల సమీక్షలో మంత్రి హరీశ్రావు
నాగర్కర్నూల్, జనవరి 25 : ప్రభుత్వ దవాఖానల్లో వందశాతం ప్రసవాలు జరిగేలా డాక్టర్లు కృషి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లా కలెక్టర్లు, వైద్య సిబ్బంది, ఆడిట్ ఆఫీసర్లతో నాగర్కర్నూల్ తేజ కన్వెన్షన్ హాల్లో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానలో ప్రసవం జరిగితే కేసీఆర్ కిట్తోపాటు రూ.13 వేలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేట్లో ఎక్కువ శాతం సీ సెక్షన్ జరుగుతున్నాయని, ప్రభుత్వ దవాఖానల్లో సీ సెక్షన్ చాలా తక్కువ ఉందన్నారు. దీంతో ఆర్థికంగా నష్టపోతారని, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో మొదటి ఏఎన్సీ, నాలుగో ఏఎన్సీ నమోదు శాతం చాలా తక్కువగా ఉందని, కేవలం 63 శాతం మాత్రమే నమోదవుతున్నాయన్నారు. దీనిని పెంచేలా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. గర్భం దాల్చిన 12 వారాల్లోనే మొదటి ఏఎన్సీ నమోదు కావాలని.. అప్పుడు మాత్రమే గర్భిణికి రక్తహీనత లేకుండా సమయానికి ప్రసవం జరుగుతుందన్నారు. వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో సకాలంలో ఏఎన్సీ నమోదు చేయకపోవడంతో గర్భిణులు 80 శాతం రక్తహీనతతో బాధపడుతున్నారని, దీనిని తగ్గించేలా పనిచేయాలని వైద్యులను ఆదేశించారు.
ప్రైవేట్లో చాలా మంది గర్భిణులు సీ సెక్షన్ చేయించుకొని రూ.30 వేల వరకు నష్టపోతున్నారన్నారు. అడిగిన ప్రతి ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని.. మొబైల్కు రిపోర్టును మెసేజ్ చేయాలని ఆదేశించారు. ఫీవర్ కిట్లు ఎన్ని వచ్చాయి..? ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు సర్వే చేశారు..? ఎన్ని కిట్లు ఇచ్చారు..? అనే వివరాలను తెలుసుకున్నారు. ఎంతమందికి బీపీ, షుగర్ ఉన్నది..? మందులు ఇస్తున్నారా..? వారు వాడుతున్నారా లేదా తెలుసుకుంటున్నారా..? అని వైద్యులను ప్రశ్నించారు. అనంతరం పీహెచ్సీ వారీగా సమీక్ష నిర్వహించారు. పీహెచ్సీల్లో మరమ్మతులు అవసరమైతే ప్రతిపాదనలు పంపాలని.. వెంటనే నిధులు మంజూరు చేస్తామన్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో నాలుగు వేల పైచిలుకు ఫీవర్ కిట్లు ఇవ్వగా.. వనపర్తిలో 6,305 కిట్లు ఇచ్చారన్నారు. జిల్లాలో వైద్యాధికారుల పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో ఎంపీ రాములు, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, కార్పొరేషన్ చైర్మన్లు శ్రీనివాస్, సాయిచం ద్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, కలెక్టర్లు ఉదయ్కుమార్, షేక్యాస్మిన్ బాషా, వైద్యాధికారులు, మెడికల్, ప్రోగ్రాం, ఆడిట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.