అండగా జిల్లాల్లో సఖీ కేంద్రాలు..
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి, పెగడపల్లి మండలాల్లో పర్యటన
పెద్దపల్లి రూరల్/పెగడపల్లి, జూన్ 24: రాష్ట్రంలో ప్రభుత్వం మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నదని, ఈ క్రమంలోనే జిల్లా కేంద్రాల్లో సఖీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. గురువారం మంత్రి ఈశ్వర్ పెద్దపల్లి జిల్లాకేంద్రంలో, పెగడపల్లి మండలంలో పర్యటించారు. పెద్దపల్లిలోని రంగంపల్లిలో గురువారం రూ. 45 లక్షలతో నిర్మించనున్న సఖీ కేంద్రం భవన నిర్మాణానికి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే దాసరి, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్తో కలిసి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. పెగడపల్లి మండలం నంచర్ల, ఎల్లాపూర్ గ్రామాల్లో రైతు వేదిక భవనాలతో పాటు, నంచర్ల సహకార సంఘం ఆధ్వర్యంలో రాములపల్లిలో రూ.33 లక్షలతో నిర్మించే గోదాం నిర్మాణ పనులను మంత్రి ఈశ్వర్ ప్రారంభించారు. వెంగళాయిపేటలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి వచ్చిన మంత్రి ఈశ్వర్కు ఎమ్మెల్యే దాసరితోపాటు కౌన్సిలర్ గాదె మాధవి, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆయా చోట్ల మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ పేద మహిళలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో సఖీ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.
వీటి ద్వారా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, హింస విషయంలో కఠినంగా వ్యవహరించడం కోసం హెల్ప్ లైన్ నంబర్ 181ను ఏర్పాటు చేసిందని తెలిపారు. సఖీ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకుని ఆరు నెలల్లోగా భవనాన్ని ప్రారంభించుకుంటామని పేర్కొన్నారు. మహిళలు ఎన్నో రకాల వేదనలతో సఖీ కేంద్రానికి వస్తుంటారని, వారి బాధలను మానవీయ కోణంలో ఆలోచించి సమస్యలకు పరిష్కారం చూపే దిశగా సఖీ కేంద్ర నిర్వాహకులు ధర్మంగా పని చేయాలని, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా సఖీ కేంద్రానికి ఇప్పటివరకు 424 కేసులు రాగా అందులో 333 కేసులను కౌన్సిలింగ్, కేసుల ద్వారా పరిష్కరించారని వివరించారు. భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమైందని, సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రాజెక్టుల వల్ల కేవలం 30 లక్షల ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ కృషి వల్ల, ప్రాజెక్టుల నిర్మాణంతో కోటీ 30 లక్షల ఎకరాలకు రెండు పంటలకూ సాగు నీరు అందుతున్నదని మంత్రి ఈశ్వర్ పేర్కొన్నారు. వరి ధాన్యం దిగుబడిలో మన రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందన్నారు. రైతు వేదికలు అధ్యయన కేంద్రాలని, వీటి ద్వారా రైతులకు సమగ్ర సమాచారం అందుతుందని, రైతులు వరితో పాటు, ఆదాయం ఇచ్చే ఇతర పంటలపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు.
పెద్దపల్లిలో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ 181పై ప్రజలకు విస్త్రృతంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, రాష్ట్ర ఆహార సంస్థ కార్పొరేషన్ సభ్యు లు ఆనంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్, డీసీసీబీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ధర్మారం జడ్పీటీసీ వుస్కూరి పద్మజ, ఓదెల జడ్పీటీసీ గంట రాములు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి పీ లక్ష్మీరాజం, జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి మొగులయ్య, పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్, పంచాయతీరాజ్ ఈఈ మునిరాజ్, కౌన్సిలర్ గాదె మాధవి, తహసీల్దార్ దుర్శెట్టి శ్రీనివాస్, సీడీపీవోలు కవిత, స్వరూపరాణి, పద్మశ్రీ, సూపర్వైజర్లు జమున, సఖీ కేంద్రం నిర్వాహకులు రాజ్కమల్, సీఏ దారవేని స్వప్న, ఆర్ఐ వరలక్ష్మి పాల్గొన్నారు. మంత్రి ఈశ్వర్ పర్యటన సందర్భంగా పెద్దపల్లి జోన్ డీసీపీ పులిగిళ్ల రవిందర్, ఏసీపీ సాదుల సారంగపాణి, సీఐ ప్రదీప్కుమార్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పోలీసులు బందోబస్తు చేపట్టారు.